Revanthreddy : తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్ రావ్ ఠాక్రే రంగంలోకి దిగారు. పార్టీలో ఉన్న సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టారు. హైదరాబాద్ వచ్చిన ఠాక్రే.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో సమావేశమయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్గా నియమితులైన తర్వాత తొలిసారిగా రాష్ట్రానికి చేరుకున్న ఠాక్రేకు శంషాబాద్ ఎయిర్పోర్టులో నేతలు స్వాగతం పలికారు. అనంతరం గాంధీభవన్లో నిర్వహించిన సమావేశంలో ఠాక్రే పాల్గొన్నారు. పార్టీలో నెలకొన్న వివాదాలపై రేవంత్, భట్టి విక్రమార్కతో చర్చించారు. నేతల మధ్య సయోధ్య ఎలా కుదర్చాలన్న దానిపై సమాలోచనలు జరిపారు.
మాజీ మంత్రులు శ్రీధర్ బాబు, గీతారెడ్డిలతోపాటు 26మంది సినీయర్ నేతలతో ఠాక్రే వేర్వేరుగా భేటీ అయ్యారు. మరోవైపు ఈ సమావేశానికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హాజరుకావాలని పార్టీ కార్యాలయం నుంచి సమాచారం అందించారు. గాంధీభవన్లో ఏఐసీసీ కార్యదర్శులతో సమావేశమైన ఠాక్రే.. నాయకుల మధ్య విభేదాలు నెలకొనేందుకు దారి తీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. రాత్రి 7 గంటలకు పీఏసీ సభ్యులతో ఠాక్రే భేటీ కానున్నారు.
గురువారం డీసీసీ అధ్యక్షులు, ఆఫీస్ బేరర్లు, అనుబంధ సంఘాల ఛైర్మన్లు, అధికార ప్రతినిధులతో ఠాక్రే సమావేశాలు నిర్వహించనున్నారు. మొత్తంమీద మానిక్కం ఠాగూర్ స్థానంలో ఇన్ ఛార్జ్ గా వచ్చిన ఠాక్రేకు తొలి పర్యటనలో నేతలు మధ్య విభేదాలు స్వాగతం పలికాయి. ఈ సమస్యలను పరిష్కరించడమే ఆయన ముందున్న బిగ్ టాస్క్..