Revanthreddy : తెలంగాణలో రాజకీయ కోర్టుల విషయం హాట్ టాఫిక్ గా మారింది. బీజేపీలో కోవర్టులు ఉన్నారని ఈటల రాజేందర్ చేసిన కామెంట్స్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. ఈటల ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాషాయ పార్టీలో రాజేందర్ అసంతృప్తిగా ఉన్నారని అనిపిస్తోందన్నారు. ముందుకు వెళ్లలేక, వెనక్కి రాలేక సతమతమవుతున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ను గద్దె దించాలన్న లక్ష్యంతోనే ఈటల బీజేపీలో చేరారని అయితే.. కాషాయ పార్టీ, కేసీఆర్ ఒక్కటే అన్న విషయం ఆయన మాటల్లోనే స్పష్టమైందని చెప్పారు. బీజేపీలో కోవర్టులు ఉన్నారని ఈటల అన్నారంటే.. ఆయన ఏదో అసంతృప్తిగా ఉన్నట్లే కాదా? అని ప్రశ్నించారు. ఇప్పుడు ఆయన లక్ష్యసాధన కోసం ప్రత్యామ్నాయ మార్గాన్ని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
ఆ నేతలు బీజేపీలో ఇమడలేరు..
ఈటల రాజేందర్, జి.వివేక్ , కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. బీజేపీ సిద్ధాంతాలను విశ్వసించరని రేవంత్ అన్నారు. బీజేపీ ఐడియాలజీతో ఈ ముగ్గురు నేతలకు సెట్ కాదన్నారు. వారు కేసీఆర్ను మాత్రమే వ్యతిరేకిస్తారన్నారు. హుజూరాబాద్, మునుగోడు ఉపఎన్నికల్లో సందర్భానుసారమే బీజేపీకి ఓట్లు పడ్డాయన్నారు.
పొంగులేటి వస్తారా..?
పొంగులేటి శ్రీనివాసరెడ్డితో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చర్చిస్తున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. హైకమాండ్ ఆ బాధ్యతలు భట్టి విక్రమార్కకు అప్పగించిందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని మరింత కఠినతరం చేస్తామని రేవంత్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేయడానికి వయో పరిమితిని 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గిస్తామని ప్రకటించారు. 21 ఏళ్లకే కలెక్టర్ అయ్యేందుకు అవకాశం కల్పించనప్పుడు..అదే వయస్సులో ఎమ్మెల్యే అయితే తప్పేముందని రేవంత్ అభిప్రాయపడ్డారు.
కేసీఆర్ తీరు మార్చుకో..
సీఎం కేసీఆర్కు ఎప్పుడూ అంబేడ్కర్ పై గౌరవం లేదని రేవంత్ మండిపడ్డారు. కేసీఆర్ పుట్టిన రోజున కాకుండా, అంబేడ్కర్ పుట్టిన రోజు కొత్త సచివాలయాన్ని ప్రారంభిస్తే గౌరవం ఉండేదని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ రాజ్యాంగాన్ని అవమానించారని ఆరోపించారు. రిపబ్లిక్ డేను ప్రగతిభవన్, రాజ్భవన్కే పరిమితం చేశారని మండిపడ్డారు. గణతంత్ర వేడుకను వివాదాలకు వేదిక చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్, సీఎం మధ్య విభేదాలుంటే మరో వేదికపై ప్రదర్శించాలని సూచించారు. సీఎం కేసీఆర్ తన వ్యవహార శైలి మార్చుకోవాలని సూచించారు. సీఎం వెంటనే గవర్నర్కు క్షమాపణ చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.