Revanth Review Meeting: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెల రోజులు గడిచింది. ప్రజా పాలనే ధ్యేయమని చెప్పిన సీఎం రేవంత్రెడ్డి ఆ దిశగానే తన మార్క్ చూపిస్తూ ముందుకు సాగుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతీ మాటను నెరవేర్చేందుకుగాను ముందుగా.. ఆరు గ్యారెంటీ స్కీంలపై ఫోకస్ పెట్టారు. ప్రగతిభవన్ గడీలు బద్దలు కొట్టి ప్రజా భవన్గా మారుస్తానన్న మాటను కూడా నిలబెట్టుకున్నారు. జనం సమస్యలను వినేందుకు ప్రజాభవన్ను ప్రజావాణి వేదికగా మార్చారు. సామాన్యులు సైతం ప్రగతిభవన్లోకి అడుగుపెట్టేలా దాని రూపురేఖలను మార్చేశారు. ఈ నేపథ్యంలోనే నెల రోజులపాలనపై సోమవారం మంత్రులతో సమీక్ష నిర్వహించనున్నారు సీఎం రేవంత్రెడ్డి. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రులు భేటీ కానున్నారు. ఈ సమీక్షలో నెల రోజులపాలన, ఆరు గ్యారెంటీల అమలుపై ప్రధానంగా చర్చించనున్నట్టు తెలుస్తోంది. దీంతోపాటు త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా చర్చించనున్నారు.
రేవంత్ సర్కార్ అధికారంలోకి రాగానే గ్యారెంటీలపై ఫోకస్ పెట్టారు. ఈ మేరకు సమీక్షలో ఆరు గ్యారెంటీల కోసం చేపట్టిన ప్రజాపాలనపై చర్చ జరగనుంది. ఈ సందర్భంగా ప్రజాపాలనపై ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్ను సీఎం ప్రారంభిస్తారు సీఎం రేవంత్. దీంతో పాటు మరిన్ని హామీలు అమలుకు సంబంధించిన విషయాలపై కూడా మంత్రులతో చర్చించనున్నట్టు తెలుస్తోంది. అలాగే త్వరలో పార్లమెంట్ ఎన్నికలకు షెడ్యూల్ ఖరారు కానుండటంతో ఎలక్షన్ కోడ్కు ముందుగానే ఆరు గ్యారెంటీ స్కీంలను వేగంగా అమలు చేసే యోచనలో ఉంది సర్కార్. ఈ మేరకు మంత్రులతో జరిగే సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. అలాగే ఎమ్మెల్సీ పదవులతో పాటు కార్పొరేషన్ల ఛైర్మన్లు, టీఎస్పీఎస్సీ ఛైర్మన్ నియామకాలపై దృష్టి సారించిన ప్రభుత్వం ఈ అంశంపై కూడా సమీక్షలో చర్చించే అవకాశం ఉంది.