Revanth Reddy : తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వరుస బహిరంగ సభల్లో పాల్గొని బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఖానాపూర్ లో కాంగ్రెస్ బహిరంగ సభలో మరోసారి కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ దగ్గర నోట్లు ఉంటే .. కాంగ్రెస్ అభ్యర్థుల దగ్గర ఓట్లు ఉన్నాయని అన్నారు. ఇతర పార్టీలు నోట్లు ఉన్న వాళ్లకే టిక్కెట్లు ఇచ్చాయని ఆరోపించారు. కాంగ్రెస్ మాత్రం ఓటర్ల మద్దతు ఉన్న అభ్యర్థికే టిక్కెట్ ఇచ్చిందన్నారు. దళితుల పట్ల కాంగ్రెస్ కు ఉన్న ప్రేమ ఇతర పార్టీలకు లేదని స్పష్టం చేశారు.
ప్రాణహిత -చేవెళ్ల డిజైన్లు మార్చి కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు కేసీఆర్ దోచేశారని రేవంత్ విమర్శించారు. ధరణి పోర్టల్ ఏర్పాటు చేసి భూదందాలు చేశారని మండిపడ్డారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 10 వేల ఎకరాల భూములను కేసీఆర్ కుటుంబ సభ్యులు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ఆ భూములు పోతాయనే కేసీఆర్ భయపడుతున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి కన్నా మెరుగైన విధానాన్ని తీసుకొస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. లంబాడి, ఆదివాసీలకు భూమలుపై హక్కులు కల్పిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే పోడు భూమలుకు పట్టాలు ఇచ్చిందని గుర్తు చేశారు. అటవీ ప్రాంత భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్నవారికి సాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఖానాపూర్ లో వెడ్మ బొజ్జు పటేల్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు.
ఆదివాసీలను, లంబాడీల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. రెండు వర్గాలను కూర్చోబెట్టి మాట్లాడి ఉంటే సమస్య వచ్చేది కాదన్నారు. ఆదివాసీలు, లంబాడీలు కాంగ్రెస్ రెండు కళ్లు లాంటి వారని స్పష్టం చేశారు. ఇప్పటికీ రాష్ట్రంలో 24 గంటల కరెంట్ లేదన్నారు. సబ్ స్టేషన్ ల్లో లాగ్ బుక్ లు చెక్ చేద్దామా ? అని సవాల్ విసిరారు. 24 గంటలు కరెంటు ఇస్తున్నారో లేదో లెక్కలు చూద్దామా? అని అన్నారు. ఇప్పటికీ గిరిజన ప్రాంతాల్లో చాలా గ్రామాలకు కరెంట్ సరఫరా లేదన్నారు. బీజేపీపైనా రేవంత్ ప్రశ్నల వర్షం కురిపించారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఒక్క చోటైనా బీసీ సీఎం ఉన్నారా అని ప్రశ్నించారు.