ఢిల్లీ మద్యం స్కామ్ కేసులో బీజేపీ, బీఆర్ఎస్ నాటకాలు ఆడుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల్లో గెలుపు కోసం కుమార్తెను జైలుకు పంపేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత అరెస్టుతో సానుభూతి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్.. కిషన్ రెడ్డి వేర్వేరు కాదని స్పష్టంచేశారు. కేసీఆర్ అనుచరుడు కిషన్రెడ్డి అని పేర్కొన్నారు. సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతున్నప్పుడే పోటాపోటీగా విమోచన దినోత్సవాలు చేస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ సభను అడ్డుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం అవినీతిపై ఈడీ, సీబీఐ దర్యాప్తు జరగదన్నారు. కేసీఆర్ పై మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా విమర్శలు చేస్తారు కానీ.. ఒక్క కేసు కూడా పెట్టలేదన్నారు. కేసీఆర్ అవినీతిపై బీజేపీ ఎందుకు విచారణకు ఆదేశించలేదని రేవంత్ ప్రశ్నించారు.
బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ను విమర్శించే అర్హతలేదని రేవంత్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ ఏటీఎంలా వాడుకుంటున్నారని ఆరోపించారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు కోసం చేసిన వ్యయం కంటే ప్రచారం కోసమే ఎక్కువ ఖర్చు చేశారని విమర్శించారు.