Revanth Reddy : తెలంగాణ సెంటిమెంట్ తో ఎన్నికల్లో లబ్ధి పొందడానికి సీఎం కేసీఆర్ కుట్రలు పన్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆరోపించారు. కొడంగల్లోని ZPHS పోలింగ్బూత్లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించున్న రేవంత్.. నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద ఏపీ, తెలంగాణ పోలీసుల మధ్య నెలకొన్న వివాదంపై స్పందించారు. రాష్ట్రంలో పోలింగ్ ప్రారంభంకావడానికి ముందు ఈ వివాదాన్ని సృష్టించారని మండిపడ్డారు.
తెలంగాణ ప్రజలకు సమయస్ఫూర్తి ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సమస్య ఎందుకు వచ్చిందో అర్థం చేసుకోగలరని తెలిపారు. ఏ ప్రయోజనాల కోసం ఇలా చేస్తున్నారో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. వ్యూహాత్మకంగానే అలా చేశారని ఆరోపించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన జరిగి తొమ్మిదిన్నర ఏళ్లు అయ్యిందని నాగార్జున సాగర్ కానీ, గేట్లూ ఎక్కడికీ పోవన్నారు. నీళ్లూ అక్కడే ఉంటాయని తెలిపారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు సీఈవో బాధ్యత తీసుకుని ఆ అంశంపై చర్చించాలని కోరారు. ఉద్రిక్త పరిస్థితులు చల్లారేలా చూడాలని కోరారు.
కేసీఆర్ ప్రభుత్వం సమస్యను పరిష్కరించకపోవడం వల్లే సమస్యలు వస్తున్నాయని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం రావాలంటే సరైన ప్రభుత్వం రావాలన్నారు. డిసెంబర్ 9న కాంగ్రెస్ సర్కార్ ఏర్పడుతుందని.. ఏపీ సహా మిగతా రాష్ట్రాలతోనూ నీటి సమస్యలపై చర్చించి సామరస్యంగా పరిష్కరించుకుంటామన్నారు. కృష్ణా, గోదావరి జలాలు, ఆస్తుల పంపకాలు, మిగిలిన వివాదాలను కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరిస్తుందని స్పష్టం చేశారు. ప్రజలు బీఆర్ఎస్ కుట్రల్లో పడొద్దని సూచించారు. ఆఖరి ప్రయత్నంగా దింపుడు కళ్లెం ఆశగా ఇలాంటి వాటిని గులాబీ పార్టీ చేస్తోందని రేవంత్ ఆరోపించారు.