Revanth Reddy : తెలంగాణ సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్న రేవంత్ రెడ్డి .. ప్రజలకు ఆహ్వానం పంపారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో గురువారం మధ్యాహ్నం ఒంటి గంటా 4 నిమిషాలకు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమానికి ప్రజలను ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేశారు.
విద్యార్థుల పోరాటం, అమరుల త్యాగం, సోనియా గాంధీ ఉక్కు సంకల్పంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని రేవంత్ పేర్కొన్నారు. అందరి ఆకాంక్షలు నెరవేర్చే ఇందిరమ్మ రాజ్య స్థాపనకు సమయం ఆసన్నమైందన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య, పారదర్శక పాలన అందించేందుకు.. బలహీనవర్గాలు, దళిత, గిరిజన, మైనారిటీ, రైతు, మహిళ, యువత సంక్షేమ ప్రభుత్వం ఏర్పాటు కోసం డిసెంబర్ 7న సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నానని తెలిపారు. ఈ కార్యక్రమానికి రావాలని అందర్నీ ఆహ్వానించారు.
సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం కోసం ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏర్పాట్లను చీఫ్ సెక్రటరీ, ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. ప్రమాణ స్వీకారానికి వీవీఐపీలు హాజరుకానున్నారు. సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక, మల్లికార్జున ఖర్గేతోపాటు ఇతర పార్టీల నేతలు రానున్నారు. ఈ నేపథ్యంలో భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.
ఎల్బీ స్టేడియం పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. నగరవాసులు ఎల్బీ స్టేడియానికి వచ్చే మార్గాల్లో కాకుండా ఇతర మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.
గురువారం ట్రాఫిక్ ఆంక్షలు ఇలా…
పబ్లిక్ గార్డెన్ నుంచి ఎల్బీ స్టేడియం వైపు వచ్చే వాహనాలు.. నాంపల్లి వైపు మళ్లింపు..
ఎస్బీఐ గన్పౌండ్రి నుంచి వచ్చే వాహనాలు.. చాపెల్ రోడ్డు వైపు మళ్లింపు..
బషీర్బాగ్ నుంచి ఎల్బీ స్డేడియం వైపు వచ్చే వాహనాలు.. కింగ్ కోఠి వైపు మళ్లింపు..
సుజాత స్కూల్ నుంచి ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్ వైపు వచ్చే వాహనాలు.. నాంపల్లి వైపు మళ్లింపు
మరోవైపు రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. ముందు పర్యటన ముగించుకొని ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయనకు అధిష్టానం నుంచి కాల్ రావడంతో మళ్లీ వెనక్కి వెళ్లి మాణిక్ రావు ఠాక్రేను కలిశారు. గంటకుపైగా చర్చించారు. ఈ చర్చలు ముగిసిన తర్వాత హైదరాబాద్ కు బయలుదేరారు.