Revanth Reddy : మహబూబ్నగర్లో ఆదివారం రాత్రి కాంగ్రెస్ చేపట్టిన విద్యార్థి, నిరుద్యోగ నిరసన ర్యాలీకి జనం పోటెత్తారు. యువత భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ విధానాలను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తప్పుపట్టారు. సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టానని సీఎం కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. మరి మంత్రివర్గంలో మాల, మాదిగలు ఎంతమందికి చోటు కల్పించారని ప్రశ్నించారు. సీఎం ఆయన సామాజిక వర్గం వారికే 4 మంత్రి పదవులు కట్టబెట్టారని మండిపడ్డారు.
అంబేడ్కర్ ముసుగు వేసుకుని మరోసారి ఓట్లు అడగడానికి కేసీఆర్ వస్తున్నారన్నారని రేవంత్ విమర్శించారు. పదో తరగతి పరీక్ష పత్రాలు బయటకు వస్తున్నాయి. ఇంటర్ జవాబు పత్రాలు సరిగ్గా దిద్దడం లేదు.. టీఎస్పీఎస్సీ ద్వారా పరీక్షలు పద్ధతిగా నిర్వహించడం లేదు.. రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు.. తెలంగాణ మోడల్ అంటే ఇదేనా అని నిలదీశారు. ప్రశ్నపత్రాలను బజారులో అమ్ముకుని లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. ప్రశ్నపత్రాల లీకేజీకి మంత్రి కేటీఆర్ కారణమని మరోసారి రేవంత్ ఆరోపించారు. భూములు, ఇసుక, మైనింగ్ దందాలతోపాటు ప్రశ్నపత్రాలను కూడా ఈ ప్రభుత్వం అమ్ముకుంటోందని విమర్శించారు.
గత ఎన్నికల్లో యువతకు ఉద్యోగాలు ఇస్తానని లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానని కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని రేవంత్ గుర్తు చేశారు. ఇందుకోసం 30 లక్షల మంది తమ పేర్లను నమోదు చేయించుకున్నారని తెలిపారు. వీరందరికీ నిరుద్యోగ భృతి బకాయి కట్టిన తర్వాతే ఎన్నికల్లో కేసీఆర్ ఓట్లు అడగాలని స్పష్టం చేశారు. 2009లో మహబూబ్నగర్ నుంచి కేసీఆర్ను ఎంపీగా గెలిపిస్తే ముఖ్యమంత్రి అయిన తర్వాత పాలమూరును ఎందుకు అభివృద్ధి చేయలేదని రేవంత్ ప్రశ్నించారు.