తెలంగాణలో భారీ వర్షాలు, వరదల విషయంలో ప్రభుత్వ తీరుపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వాతావరణశాఖ ముందే హెచ్చరించినా బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోలేదన్నారు. సీఎం కేసీఆర్కు పార్టీ ఫిరాయింపులపైనే శ్రద్ధ ఎక్కువగా ఉందని విమర్శించారు. తెలంగాణ ప్రజల ప్రాణాలపై సీఎంకు ఏమాత్రం శ్రద్ధ లేదన్నారు.
హైదరాబాద్ ఉప్పల్ లో భారీ వర్షాలతో ముంపునకు గురైన ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ పర్యటనలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పించారు. వర్షాలు, వరదల ముప్పుపై సీఎం కేసీఆర్ సమీక్ష చేయలేదని మండిపడ్డారు. సీఎం.. రాజకీయాలపైనా దృష్టి పెట్టారని విమర్శించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడంలోనూ బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
భారీ వర్షాలు, వరదల వల్ల 30 మంది చనిపోయినా కేసీఆర్ పరామర్శించేందుకు ఎందుకు వెళ్లడంలేదని రేవంత్ రెడ్డి నిలదీశారు. తాత్కాలిక వరద సాయం కింద తెలంగాణకు కేంద్రం రూ.వెయ్యి కోట్ల నిధులు వెంటనే విడుదల చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు.