Revanth Reddy: టీఎస్-ఐపాస్ కింద తెలంగాణ ప్రభుత్వం తప్పుడు సమాచారం ప్రకటిస్తోందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఇచ్చిన నివేదికపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. డ్రామారావు.. మరో డ్రామా అంటూ ట్వీట్ చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ మ్యానిపులేటర్ అంటూ రేవంత్ విమర్శించారు. నీకర్ధమవుతోందా తెలంగాణ!! అంటూ చర్చకు తెరలేపారు.
రాష్ట్రంలోకి రాని పెట్టుబడులు వచ్చినట్టు.. లేని ఉద్యోగాలు ఇచ్చినట్లు చెబుతోందని ఎఫ్జీజీ నివేదిక బయటపెట్టింది. టీఎస్ ఐపాస్ కింద రాష్ట్రంలోకి రూ.3.3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని.. 22.5 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయని మంత్రి కేటీఆర్ ప్రకటించారని గుర్తు చేసింది. అయితే, ఆర్టీఐ కింద సమాచారం సేకరించగా.. రూ.2.67 లక్షల కోట్ల పెట్టుబడులు రావచ్చని.. 17.82 లక్షల మందికి జాబ్స్ లభించే ఛాన్స్ ఉందని తెలిపిందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ తెలిపింది. తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని అభిప్రాయపడింది. టీఎస్ ఐపాస్లో క్లియర్ చేసిన పరిశ్రమలు పిండిమరలు, వెల్డింగ్ పనులు, ఇటుక పనులు, స్టోన్ క్రషర్ వంటివి ఉన్నాయని చెప్పింది.
మరో ఆసక్తికర విషయం కూడా వెల్లడించింది FGG. మెట్రో రైలు, జీఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయం, రామగుండం ఎరువుల కర్మాగారం, యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్లు లాంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ఐపాస్ ఖాతాలో చూపించారని గుర్తించింది. ఇక మైహోమ్ కన్స్ట్రక్షన్స్, అపర్ణ హౌజింగ్, ఫీనిక్స్ కన్స్ట్రక్షన్స్ లాంటి రియల్ ఎస్టేట్ సంస్థల వెంచర్లకు సైతం టీఎస్ ఐపాస్ క్లియరెన్స్ ఇచ్చినట్టు చెబుతున్నారని తేల్చింది.
ఈ న్యూస్ను కోట్ చేస్తూ.. పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ట్విట్టర్లో కేటీఆర్ టార్గెట్గా డ్రామారావు అంటూ విమర్శలు చేశారు. రేవంత్ ట్వీట్ ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతోంది.