రేవంత్రెడ్డి హైదరాబాద్లో మాట్లాడితేనే ఢిల్లీ వరకు రీసౌండ్ వినిపిస్తుంది. అలాంటిది ఢిల్లీలోనే బీజేపీపై అటాక్ చేస్తే.. ఎట్టా ఉంటుందో తెలుసా? లోక్సభలో అదే జరిగింది. మోదీ సర్కారుపై అవిశ్వాస తీర్మానంపై చర్చలో కాంగ్రెస్ ఎంపీగా రేవంత్రెడ్డి స్పీచ్ అదిరిపోయింది. ప్రధాని మోదీని సభలోకి రప్పించాల్సిందేనంటూ స్పీకర్ను పట్టుబట్టారు రేవంత్. ఇక బీజేపీకి, ఎన్డీయేకు కొత్త డెఫినేషన్లతో లోక్సభలో చెలరేగిపోయారు.
ఆగస్టు 9 ఆదివాసీ దినోత్సవమని గుర్తు చేస్తూ.. కనీసం ఈరోజైనా మణిపూర్లో ఆదివాసీలు, గిరిజనులపై జరిగిన మారణకాండపై ప్రధాని మోదీ పార్లమెంట్కు వచ్చి వివరణ ఇస్తే బాగుండేదని అన్నారు. తలలు నరికి, రక్తం ఏరులై పారుతున్నా.. మోదీ మాట్లాడటం లేదని.. ప్రజలపై, జాతులపై ఆయనకు భక్తి, గౌరవం లేదని తప్పుబట్టారు. ప్రధాని మోదీ సభకు వచ్చేలా స్పీకర్ తన అధికారాన్ని ఉపయోగించి ఆదేశాలు ఇవ్వాలని రేవంత్ డిమాండ్ చేశారు.
మణిపూర్లో మతాలు, జాతుల మధ్య హింసను రెచ్చగొడుతూ.. బ్రిటిష్ వారిలా విభజించు, పాలించు విధానం అవలంభిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి మండిపడ్డారు. అందుకే బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదని.. బ్రిటిష్ జనతా పార్టీ అంటూ కొత్త అర్థం చెప్పారు. ఎన్డీయే అంటే నేషన్ డివైడ్ అలయెన్స్ అంటూ విమర్శించారు.
తాను బుక్షాప్కు వెళ్లి అబద్దాల పుస్తకాలు ఇవ్వాలంటే రెండు బుక్స్ ఇచ్చారంటూ.. 2014, 2019 బీజేపీ మేనిఫెస్టోలను సభలో చూపించారు. 2014 మేనిఫెస్టోలో వాజ్పేయ్, అద్వానీ, జోషీ తదితరుల ఫోటోలు ఉన్నాయని.. అదే 2019 మేనిఫెస్టోలో అందరి ఫోటోలు తీసేసి.. మోదీ ఒక్కరి ఫోటోనే పెట్టారని అన్నారు. వన్ నేషన్.. వన్ పర్సన్లా మోదీ తీరు ఉందని ఆరోపించారు.
మణిపూర్లో హింస చెలరేగుతుంటే.. మోదీ, అమిత్ షాలు అక్కడికి వెళ్లకుండా ఓట్ల కోసం కర్నాటకలో తిరిగారని రేవంత్ తప్పుబట్టారు. ఆదివాసీలు, గిరిజనులంటే వారికి చిన్నచూపు అని మండిపడ్డారు. అందుకే, మోదీకి ప్రధానిగా ఉండే అర్హత లేదంటూ.. వెంటనే పదవి నుంచి దించేయడానికే INDIA కూటమి తరఫున అవిశ్వాస తీర్మానం ఇచ్చామని చెప్పారు రేవంత్రెడ్డి.