Revanth Reddy Narayanpet : నారాయణపేటలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభలో ప్రసంగించిన రేవంత్ రెడ్డి నారాయణపేట గడ్డ కాంగ్రెస్ అడ్డా అని ప్రస్తావించారు. వందలాది మంది బిడ్డల ప్రాణత్యాగం వల్ల తెలంగాణ ఏర్పడిందని గుర్తుచేశారు. ప్రత్యేక రాష్ట్రంలో రైతాంగ సమస్యలు.. విద్యార్థుల సమస్యలు తీరుతాయని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఆశించారన్నారు. అమరవీరుల కుటుంబాలు ఆత్మగౌరవంతో బ్రతుకుతాయి అని అనుకున్నారని తెలిపారు. కానీ ఈ ప్రభుత్వ పాలనలో అవేమి జరగలేదని మండిపడ్డారు.
2014లో నారాయణపేట నియోజకవర్గంలో టీడీపీ తరపున గెలిచిన సామ రాజేందర్ రెడ్డి.. దొర గూటికి చేరాడని తెలిపారు. ఈ పదేళ్ల కాలంలో నారాయణపేట అభివృద్ధి ఎందుకు జరగలేదు అని ప్రశ్నించారు. వికారాబాద్-కృష్ణ రైల్వే లైన్ ఎందుకు పూర్తికాలేదు అని మండిపడ్డారు. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు మొదలుపెట్టలేదు అని ప్రశ్నించారు. రెండేళ్లలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి నారాయణపేట, కొడంగల్ ప్రజల కాళ్లు కడుగుతా అని చెప్పిన కేసీఆర్ నారాయణపేట ప్రజలను మోసం చేశారని తెలిపారు. జయమ్మ చెరువుకు కృష్ణానది నీళ్లు ఎందుకు రాలేదు అని ప్రశ్నించారు.
నారాయణపేట పేరుకే జిల్లాగా మారింది తప్ప జిల్లా కేంద్రంలో కనీసం కలెక్టర్ ఆఫీస్ లేదని రేవంత్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో ఉండవలసిన కనీస మౌలిక వసతులు నారాయణపేట జిల్లా కేంద్రంలో లేవని తెలిపారు. తెలంగాణలోనే మొట్టమొదటి మున్సిపాలిటీ నారాయణపేట అని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ఇదే తరుణంలో నారాయణపేట కాంగ్రెస్ అభ్యర్థి చిట్టెం పర్ణిక రెడ్డిని గెలిపించాలని కోరారు. పర్ణిక రెడ్డి కుటుంబ రక్తంలోనే త్యాగం ఉందని పేర్కొన్నారు. నారాయణపేట అభివృద్ధి పర్ణిక రెడ్డి తోనే సాధ్యమవుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు. నారాయణపేట కొడంగల్ పథకానికి శ్రీకారం చుట్టింది కీ.శే చిట్టెం నర్సిరెడ్డి గారు అని గుర్తుచేశారు.
చిట్టెం నర్సిరెడ్డి గారి వారసత్వాన్ని ఈ ప్రాంతానికి ఇవ్వాలని ఈ సందర్బంగా నారాయణపేట నియోజకవర్గ ప్రజలను రేవంత్ రెడ్డి కోరారు. నారాయణపేట ఎత్తిపోతల పథకం పూర్తవ్వాలంటే చిట్టెం పర్ణికరెడ్డిని గెలిపించాలని కోరారు. కొడంగల్, నారాయణపేట రెండు వేర్వేరుగా చూడలేను అని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం ఏర్పడ్డాక నారాయణపేటకు నిధులిచ్చే బాధ్యత తనదే అని రేవంత్ స్పష్టం చేశారు. గాడిదకు గడ్డేసి.. ఆవుకు పాలు పిండితే వస్తాయా అని సెటైర్లు వేశారు. అందుకే ఈ ఎన్నికల్లో చిట్టెం పర్ణిక రెడ్డి ని గెలిపించి.. సామ రాజేందర్ ను రాయచూరుకు పంపుదాం.. కేసీఆర్ ను ఫామ్ హౌస్ కు పంపుదాం అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వస్తే ఆరు గ్యారంటీలను పక్కాగా అమలుపరుస్తాం అని రేవంత్ రెడ్డి తెలిపారు.