Revanth Reddy Speech : ములుగు నియోజకవర్గంలోని రామానుజపురం బహిరంగ సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణాస్త్రాలు సంధించారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత కేసీఆర్ లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. 10 వేల ఎకరాల భూములు ఆక్రమించుకున్నారని విమర్శించారు. ఉద్యోగులను , రైతులను మోసం చేశారని మండిడ్డారు.
రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఆత్మహత్యలు పాల్పడుతున్నారని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని తీవ్ర విమర్శలు చేశారు. పాలకులు ఆధిపత్యం చెలాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే వారని అణచి వేయడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణను కేసీఆర్ కుటుంబ సంకెళ్ల నుంచి విముక్తి కల్పించడానికే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రాష్ట్రానికి వచ్చారని రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణను సోనియా గాంధీ ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ ఇస్తానన్న హామీ నెరవేర్చేందుకు ఏపీలో కాంగ్రెస్ ని పణంగా పెట్టారని వివరించారు. ఇప్పుడు 6 గ్యారంటీలతో తెలంగాణ ప్రజలకు హామీలు ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తే కచ్చితంగా ఈ హామీలను సోనియా అమలు చేస్తారని రేవంత్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలను రేవంత్ వివరించారు. మహిళలకు మహలక్ష్మి పథకం ద్వారా మహిళలకు రూ. 2,500 ప్రతి నెల 1 తేదీనే ఇస్తామన్నారు. రూ. 500కే గ్యాస్ సిలిండర్, రైతు భరోసా ద్వారా ఎకరాకు రూ. 15 వేలు, కౌలు రైతులు రూ. 15 వేలు, ఉపాధి కూలీలకు రూ.12 వేలు ఇస్తామని స్పష్టం చేశారు. పేదలకు 200 యూనిట్ల వరకు కరెంట్ ఇస్తామని తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం రూ. 5 లక్షల ఆర్థికసాయం అందిస్తామని చెప్పారు. గ్రూప్-2 అభ్యర్థి ప్రవళిక ఆత్మహత్య ఘటనను రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. యువత కోసం యువ వికాసం పథకాన్ని ప్రకటించారు. ఈ స్క్రీమ్ ద్వారా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థలుకు రూ. 5 లక్షల ఇస్తామని ప్రకటించారు. పేదలకు చేయూత పథకం రూ.4 వేలు ఇస్తామన్నారు. కల్యాణ లక్ష్మి పథకం కింద తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణలో 6 గ్యారంటీలను అమలు చేసి ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ములుగు అభ్యర్థి సీతక్క, భూపాలపల్లి అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావును 50 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించాలని రేవంత్ పిలుపునిచ్చారు.