Revanth Reddy Kalwakurthy : హైదరాబాద్-శ్రీశైలం హైవే వేసింది కాంగ్రెస్ పార్టీనే అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కల్వకుర్తిలో నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగ సభలో పాల్గొన్న రేవంత్ .. కేసీఆర్ సొంతూరు చింతమడకలో గుడి, బడి కట్టింది కాంగ్రెస్సే అని తెలిపారు. అధిక పరిశ్రమలను తెచ్చి ఉపాధి అవకాశాలను కాంగ్రెస్ కల్పించిందన్నారు. దళితులు ఆత్మగౌరవంతో బతకాలని అసైన్డ్ భూములకు పట్టాలు ఇచ్చామన్నారు. గతంలో కేసీఆర్ను ఎంపీగా.. పాలమూరు నుంచి గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని విస్మరించారని మండిపడ్డారు.
బీజేపీ- బీఆర్ఎస్ కలిసే రైతుబంధు నగదు విడుదలకు అనుమతి తెచ్చుకున్నాయన్నారు రేవంత్ రెడ్డి. ఎన్నికల వేళ రైతుబంధు వేస్తామని బీఆర్ఎస్ ఈసీ నుంచి అనుమతి తెచ్చుకుందన్నారు. దళితబంధు, మైనార్టీబంధు, బీసీబంధుకు ఈసీ నుంచి ఎందుకు అనుమతి తీసుకోలేదని ప్రశ్నించారు. ఎంఐఎం, బీజేపీ, బీఆర్ఎస్ కలిసి బీసీలు, దళితులు, మైనార్టీలను మోసం చేశాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు ఎకరాకు రూ.15 వేలు ఇస్తామన్నారు.
గత 10 ఏళ్లలో కేసీఆర్ లక్ష కోట్లు దోచుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. చర్లపల్లిలో జైలులో కేసీఆర్ కు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తామన్నారు.