Revanth Reddy : కేసీఆర్ అల్లుడు హరీష్ రావు నిర్వాకం వల్లే రైతుబంధు ఆగిపోయిందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. డోర్నకల్ లో కాంగ్రెస్ విజయభేరి సభలో పాల్గొన్న ఆయన.. కేసీఆర్ అతి తెలివితేటల వల్ల రైతు బంధు ఆగిపోయిందన్నారు. బీఆర్ఎస్ కుట్రల్ని ప్రజలు గుర్తించాలన్నారు. రైతులతోపాటు రైతు కూలీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎకరాకు 15 వేలు ఇస్తామని భరోసా ఇచ్చారు. రైతు బంధు ఆగిపోవడానికి కారణమైన కేసీఆర్, హరీష్ రావును ఓడించాలని పిలుపునిచ్చారు.
రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పేటెంట్ అని పేర్కొన్నారు. డోర్నకల్ లో జాటోత్ రామచంద్రు నాయక్ ను 25 వేల మెజార్టీతో గెలిపించాలని కోరారు.
కేసీఆర్ కు చర్లపల్లి జైలులో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. 10 వేల ఎకరాలు ఆక్రమించుకున్నారని విమర్శించారు. లక్ష కోట్ల దోచుకున్నారని తెలిపారు. కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం జైలుకెళ్లడం ఖాయమని తేల్చిచెప్పారు.
పేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ. 10 లక్షల వరకు ఉచిత వైద్యసేవలు అందిస్తామన్నారు. రైతలుకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఏడాదిలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. తెలంగాణలో అమరవీరుల ఆశయాలు నెరలేదన్నారు. 30 లక్షల మంది నిరుద్యోగులను కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. అందుకే కేసీఆర్, కేటీఆర్ రాజకీయ ఉద్యోగాలు ఊడగొట్టాలని యువతను కోరారు. నిరుద్యోగులే కేసీఆర్ ను ఓడించాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగులు ఒక్కొక్కరు 5 ఓట్లు వేయిస్తే.. కాంగ్రెస్ కు కోటి 50 లక్షల ఓట్లు వస్తాయని వివరించారు. అప్పుడు కాంగ్రెస్ కు 100 సీట్లు వస్తాయన్నారు. అధికారంలోకి వస్తే.. నిరుద్యోగులకు కొలువులు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ దేనని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.