Congress Meeting Nizamabad Rural : తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. నిజామాబాద్ జిల్లాలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ధర్పల్లిలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో పాల్గొన్నారు. తెలంగాణలో బారాబర్ ఇందిరమ్మ రాజ్యం తెస్తామన్నారు. కేసీఆర్ గుర్తుంచుకో రాబోయేది ఇందిరమ్మ రాజ్యమేనని తేల్చిచెప్పారు.
తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు 10 ఏళ్లు అవకాశం ఇచ్చారని రేవంత్ రెడ్డి అన్నారు. కానీ ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చలేదని మండిపడ్డారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టే బాధ్యత కాంగ్రెస్ దేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కు 80కి తగ్గకుండా సీట్లు వస్తాయని ధీమా వ్యక్తంచేశారు.
నిజామాబాద్ రూరల్ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పై రేవంత్ విమర్శలు గుప్పించారు. ఆయన వేల కోట్లు సంపాదించుకున్నారని ఆరోపించారు. కానీ రైతుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లలేదన్నారు. కవితను ఓడించినప్పటి నుంచి నిజామాబాద్ పై కేసీఆర్ కక్ష పెంచుకున్నారని విమర్శించారు.
నిజామాబాద్ జిల్లాలోని పసుపు రైతులకు దేశంలో ప్రత్యేక పేరుందన్నారు రేవంత్ రెడ్డి. కానీ కేసీఆర్ సర్కార్ వారి సమస్యలను పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు, మహిళల కోసం ప్రవేశపెట్టే పథకాలను వివరించారు. పెన్షన్లు రూ.4 వేలకు పెంపు, మహిళలు రూ. 2500 ఆర్థికసాయం, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం, రైతులకు రూ. 15 వేలు, రైతు కూలీలకు రూ. 12 వేలు ఇస్తామని ప్రకటించారు.ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ. 5 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. నిజామాబాద్ రూరల్ లో రేకులపల్లి భూపతిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని రేవంత రెడ్డి పిలుపునిచ్చారు.