Revanth Reddy: ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ పై రాజకీయ రచ్చ జరుగుతోంది. ఎంపీ అర్వింద్ ఇంటి ధ్వంసంతో తీవ్ర ఉద్రిక్తత రాజుకుంది. ఇంతకీ కవిత కాంగ్రెస్ లో చేరాలని అనుకున్నారా? మల్లికార్జున ఖర్గేకు ఫోన్ చేశారా? కాంగ్రెస్ ఏమంటోంది? అనేది ఆసక్తికరం. లేటెస్ట్ గా కవిత వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. వెంటనే కవితను సిట్ విచారించాలని డిమాండ్ చేశారు.
కవితను బీజేపీ కొనాలని చూసిందని కేసీఆర్ చెప్పారని.. కవిత సైతం స్వయంగా ఆ విషయాన్ని ఒప్పుకున్నారని.. అందుకే, ఫాంహౌజ్ ఎమ్మెల్యేల కేసులో ఏర్పాటైన సిట్.. ఈ కేసును సైతం సుమోటోగా తీసుకొని.. కవితను విచారించాలని రేవంత్ రెడ్డి అన్నారు. కవిత నుంచి స్టేట్ మెంట్ తీసుకొని.. ఆమెను సంప్రదించిన బీజేపీ నేతలపై చర్యలు తీసుకోవాలనేది రేవంత్ డిమాండ్.
ఇక, కవిత తమ పార్టీ అధినేత మల్లికార్జున ఖర్గేకు ఫోన్ చేశారా? లేదా? అనేది తనకు తెలియదన్నారు రేవంత్ రెడ్డి. త్వరలోనే మల్లికార్జున ఖర్గే తెలంగాణకు వస్తారని.. అప్పుడు ఆయన ఈ అంశంపై స్పందించే అవకాశం ఉందన్నారు.
ఫాంహౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తమకేం సంబంధం లేదంటున్న బీజేపీ నేతలు.. కేసు విచారణ అడ్డుకొనేలా హైకోర్టుకు ఎందుకు వెళ్లారంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసు దర్యాప్తుపై బయటకు లీకులు ఇవ్వొద్దని హైకోర్టు ఆదేశించినా.. ఎప్పటికప్పుడు వివరాలన్నీ బయటకు ఎలా వస్తున్నాయంటూ నిలదీశారు. నలుగురు ఎమ్మెల్యేలను ప్రగతి భవన్ లో బంధించారని.. వారు ఏ లెక్కన జాతిరత్నాలు అవుతారంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.