బీఆర్ఎస్ కు 25 సీట్ల కంటే ఎక్కువరావని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఎగ్జిట్ పోల్స్ పై ఆయన స్పందించారు. తెలంగాణలో కాంగ్రెస్ విజయం ఖాయమైందన్నారు. సీఎల్పీ నిర్ణయం తర్వాత సీఎం ఎవరనేది తేలుతుందన్నారు.
ఈ ఎన్నికల కోసం కాంగ్రెస్ కార్యకర్తలు , నేతలు కష్టపడి పని చేశారని ప్రశంసించారు. ఆనాడు నవంబర్ 29న శ్రీకాంతాచారి తెలంగాణ కోసం ప్రాణం త్యాగం చేశాడని గుర్తుచేశారు. నాడు డిసెంబర్ 9న రాష్ట్ర ఏర్పాటుకు అడుగులు పడ్డాయన్నారు. అదే రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ ఎన్నికల తుది ఫలితాలు వచ్చిన తర్వాత క్షమాపణలు చెబుతారా? అని కేటీఆర్ కు సవాల్ చేశారు రేవంత్ రెడ్డి.
ఇంకా రేవంత్ రెడ్డి ఏమి అన్నారంటే..”కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతందని మొదటి నుంచి చెప్పాం. తెలంగాణలో దొరల పాలన అంతమొందిస్తామని చెప్పాం. కానీ బీఆర్ఎస్ ను ఓడించడం కష్టమని కొంతమంది చెప్పారు. మమ్మల్ని హేళన చేశారు. నవ్వుకున్నారు. అయినా తెలంగాణ ప్రజల చైతన్యంపై నమ్మకంతో పనిచేశాం. డిసెంబర్ 9 నాడు ప్రజల తెలంగాణ ఆవిష్కృతమవుతుంది.”
” కాంగ్రెస్ ప్రభుత్వంలో సమాజంలో అన్నివర్గాలకు స్వేచ్ఛ ఉంటుంది. అందర్నీ సమానంగా చూస్తాం. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తాం. ప్రజా హక్కుల పోరాటం చేసే వాళ్ల స్వేచ్ఛను అడ్డుకోం. మీడియాకు స్వేచ్ఛ ఇస్తాం. ప్రజాసమస్యలను మా దృష్టికి స్వేచ్ఛగా తీసుకురావచ్చు. మీడియా ప్రతినిధుల సమస్యలను పరిష్కరిస్తాం. కాంగ్రెస్ ఎవరిపైనా ఆధిపత్యం చెలాయించదు. అందుకోసం అధికారం వినియోగించదు. ప్రజా సమస్యల పరిష్కారానికే అధికారం వినియోగిస్తాం.
” ప్రజలకు సేవ చేసేందుకు 5 ఏళ్ల అధికారాన్ని తెలంగాణ ప్రజలు ఇస్తున్నారు. ఓడినోడు బానిసకాదు.. గెలిచినోడు రాజు కాదు. మేం తెలంగాణ ప్రజలకు సేవకులం. తెలంగాణ ప్రజలకు తొలి,చివరి శత్రువులు కేసీఆర్ కుటుంబంలోని ఆ నలుగురే. ఓటమి ఎదురైనప్పుడల్లా కేసీఆర్ నియోజకవర్గం మారుస్తారు”. అని రేవంత్ రెడ్డి ఇలా విషయాలను క్షప్తంగా వివరించారు.