Revanth Reddy Press Meet : తెలంగాణలో కాంగ్రెస్ విజయం అమరవీరులకు అకింతం చేస్తున్నామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. గాంధీభవన్ లో పార్టీ నేతలతో కలిసి వచ్చిన ఆయన.. శ్రీకాంతాచారి అమరుడైన రోజు తెలంగాణ ప్రజలు మంచి తీర్పు ఇచ్చారని తెలిపారు. అమరవీరుల ఆకాంక్షలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. 30 లక్షల మంది నిరుద్యోగుల పట్టుదల వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామన్నారు. మానవ హక్కులను కాపాడతామని భరోసా ఇచ్చారు. ఇకపై సచివాలయ గేట్లు సామాన్యులకు తెరచుకుంటాయని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రగతి భవన్ ను బాబా సాహెబ్ అంబేడ్కర్ భవన్ గా మారుస్తామన్నారు. ఇది ప్రజా భవన్ గా ఉంటుందన్నారు.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ శ్రేణుల్లో విశ్వాసం నింపిందని రేవంత్ రెడ్డి అన్నారు. సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక తెలంగాణ ప్రజల్లో నమ్మకం కలిగించారని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ వెన్నుతట్టి ప్రోత్సహించడం వల్లే ముందుకుసాగానన్నారు. సీనియర్ల నేతల సహకారంతో గెలిచామని చెప్పారు. సీపీఐతోపాటు సీపీఎంను కలుపుకుంటామని తెలిపారు. పాలన విషయంలో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం సలహా తీసుకుంటామన్నారు. సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని రాష్ట్ర వ్యవహారాల కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే తెలిపారు. కాంగ్రెస్ కు అధికారాన్ని కట్టబెట్టిన ప్రజల ధన్యవాదాలు చెప్పారు. రాహుల్ గాంధీ, ప్రియాంక విస్తృతంగా ప్రచారం చేయడం వల్లే ప్రజాధరణ పెరిగిందన్నారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ విజయం సాధించిందని మాణిక్ రావ్ ఠాక్రే స్పష్టంచేశారు.