Revanth Reddy : తెలంగాణ స్థానిక ప్రజాప్రతినిధులకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి బహిరంగ లేఖ రాశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో స్థానిక ప్రజాప్రతినిధుల దుస్థితిపై లేఖలో వివరించారు. జెడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన.. తనకు స్థానిక ప్రజాప్రతినిధుల బాధ్యత తెలుసన్నారు రేవంత్ రెడ్డి. ఏ ప్రభుత్వ పాలనకైనా స్థానిక ప్రజాప్రతినిధులే పునాదులన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో స్థానిక ప్రజాప్రతినిధుల అవస్థలు, వారికి జరిగిన అవమానాలు తనకు తెలుసని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని కేసీఆర్ పురుగులకంటే హీనంగా చూశారని, నిర్ణయాధికారం లేక, నిధులు రాక మీరు పడిన బాధలు గుర్తున్నాయని చెప్పారు. సర్కారు నిధులు రాకున్నా భార్య మెడలో బంగారం అమ్మి అభివృద్ధి చేసిన వాళ్లు కూడా ఉన్నారని రేవంత్ బహిరంగ లేఖలో పేర్కొన్నారు.
ఊరి కోసం అప్పుచేసి వడ్డీలు కట్టలేక కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. మరికొందరు ఉపాధి హామీ కూలీలుగా, వాచ్ మెన్లుగా పని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి దుర్ఘటనలు ఎన్నో జరిగాయని రేవంత్ రెడ్డి వివరించారు. అందుకే ఈ ఎన్నికల్లో ఆలోచించి ఓటేయాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో స్థానికప్రజాప్రతినిధుల పాత్ర అత్యంత కీలకమని, పార్టీలు, జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టాలని సూచించారు. తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఇదొక మంచి అవకాశమని, రేపటినాడు మీ కష్టాలు తీర్చి, మీ గౌరవాన్ని పెంచే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని రేవంత్ అన్నారు. స్థానిక సంస్థలకు పూర్వవైభవాన్ని ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఏకగ్రీవమైన పంచాయతీలకు రూ.10 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్, కేసీఆర్ పాలనకు చరమగీతం పాడుదామని.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు తమ వంతు పాత్ర పోషించాలని కోరారు. వార్డు సభ్యుడి నుంచి సర్పంచ్ వరకు, కౌన్సిలర్ నుంచి మున్సిపల్ చైర్మన్ వరకు, కార్పొరేటర్ నుంచి మేయర్ల వరకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నానని టీపీసీసీ చీఫ్ పేర్కొన్నారు.