Revanth Reddy Challenge : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి రాజకీయ పార్టీల్లో పోటీ పెరిగింది. ఈసారి గెలుపు మాదంటే మాదంటూ.. అధికార, ప్రతిపక్షాలు చెప్తున్నాయి. ఆదివారం ఏఐసీసీ అధిష్టానం తెలంగాణ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించగా.. బీఆర్ఎస్ 51 మంది అభ్యర్థులకు బీ ఫామ్ లు అందజేసి, మేనిఫెస్టో ప్రకటించింది. మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే.. ఏమేం చేస్తుందో చెప్పారు సీఎం కేసీఆర్.
బీఆర్ఎస్ మేనిఫెస్టో, కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. నవంబర్ 1 నాటికి ఉద్యోగులు, పింఛన్ దారులందరి ఖాతాల్లో వారికి ఇవ్వాల్సిన డబ్బు జమచేసి మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్లాలన్నారు. జరగబోయే ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచకుండా బీఆర్ఎస్ పోటీ చేయాలని, ఈ మేరకు ఈ నెల 17న అమర వీరుల స్థూపం వద్ద ప్రమాణం చేసేందుకు సిద్ధమా అని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. ఈ సవాల్ ను బీఆర్ఎస్ స్వీకరించాలన్నారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీ స్కీమ్ లతో ఓట్లు అడుగుతుందని, మీరు మీ మేనిఫెస్టోతో ప్రజలను ఓట్లు అడగాలని సూచించారు.
కాంగ్రెస్ 6 గ్యారెంటీ పథకాలను ప్రకటించాక.. కేసీఆర్ కనిపించలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ మేనిఫెస్టే.. కాంగ్రెస్ మేనిఫెస్టోకి పక్కా కాపీగా ఉందన్నారు. కేసీఆర్ తన సామర్థ్యాన్ని కోల్పోయారన్న రేవంత్.. కాపీ కొడితే అవతలి వారికి తెలియకుండా ఉండాలన్న ఆలోచన ఆయనకు లేదన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో చూసిన తర్వాత రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని తేలిపోయిందన్నారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీ స్కీమ్ లు ప్రజలకు వర్తిస్తాయని కేసీఆర్ చెప్పకనే చెప్పారన్నారు. బీఆర్ఎస్ పాతమేనిఫెస్టోకే రంగులు పూసి కొత్తగా ప్రకటించిందన్నారు.
ఆ మేనిఫెస్టో ఒక చిత్తుకాగితంతో సమానమన్నారు. కేసీఆర్ ఆరోగ్యం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రెండూ క్షీణించాయన్నారు. కాంగ్రెస్ నిర్ణయాలను కాపీ కొట్టేందుకే కేసీఆర్ ఇన్నాళ్లూ ఎదురు చూశారని విమర్శలు చేశారు. ఎక్కడో కర్ణాటకలో డబ్బు పట్టుబడితే.. దానికి కారణం కాంగ్రెస్ పార్టీనే అని చెప్పాలని చూస్తున్నారని.. నిజానికి అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ కేసీఆరే అని దుయ్యబట్టారు.