RevanthReddy: TSPSC పేపర్ లీక్స్. ముందు కాంగ్రెస్సే గళమెత్తింది. రేవంత్రెడ్డి వరుస ప్రెస్మీట్లతో దుమ్మురేపారు. పేపర్ లీక్ వెనుక ఉన్న గుట్టుమట్లను బయటకు తీశారు. మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతి హస్తం ఉందని.. ఆయన స్వగ్రామం మల్యాల మండలంలో 100 మందికి వందకు పైగా మార్కులు వచ్చాయని సంచలన ఆరోపణలు చేశారు. సిట్ నోటీసులు, విచారణ కూడా ఎదుర్కొన్నాడు. ఇలా పేపర్ లీక్స్ రేసులో రేవంత్రెడ్డి దూసుకుపోతున్న దశలో.. అనూహ్యంగా టాపిక్ బండి సంజయ్ వైపు మళ్లింది. అంతా గేమ్ ప్లాన్ అనే ఆరోపణ కూడా ఉంది.
పరీక్ష జరుగుతుండగా టెన్త్ హిందీ పేపర్ బయటకు రావడం.. బండి సంజయ్ను ఏ1 గా చేర్చడం.. అరెస్ట్ చేసి జైల్లో వేయడం.. ఆ తర్వాత బెయిల్పై బయటకు రావడం.. తెలంగాణలో రచ్చ రచ్చైంది. అరెస్ట్తో బండి సంజయ్కి ఫుల్ హైప్ వచ్చింది. వెంటనే ఆయన మరింత యాక్టివ్ అయ్యారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలతో నిరుద్యోగులకు జరిగిన అన్యాయంపై నిరసనగా.. హన్మకొండలో బీజేపీ ఆధ్వర్యంలో నిరుద్యోగ మార్చ్ నిర్వహించారు. వందలాది మంది కార్యకర్తలు, నిరుద్యోగులతో భారీ ర్యాలీ తీశారు. సర్కారుపై నిప్పులు చెరిగారు. దీంతో, లీకేజ్ మైలేజ్ మొత్తం బండి సంజయ్ ఖాతాలో పడినట్టైంది. హన్మకొండతోనే ఆగకుండా.. వరుసగా 10 ఉమ్మడి జిల్లాల్లోనూ నిరసన మార్చ్ చేపట్టేందుకు కదనోత్సాహంతో ఉంది కమలదళం.
కట్ చేస్తే, కాంగ్రెస్ సైతం అలర్ట్ అయింది. రేసులో వెనుకబడుతున్నామని గుర్తించింది. పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి రంగంలోకి దిగి.. హస్తం పార్టీ తరఫున కార్యచరణ ప్రకటించారు. బీజేపీ నిరుద్యోగ మార్చ్ చేపడితే.. కాంగ్రెస్ నిరుద్యోగ నిరసనలు, సభలకు సమాయత్తమవుతోంది.
రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం అన్ని శక్తులను కలుపుకొని ముందుకెళ్తామన్నారు రేవంత్రెడ్డి. 21న నల్గొండ, ఖమ్మంలో 24, ఆదిలాబాద్లో 26న నిరుద్యోగ నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. మే 4 లేదా 5న హైదరాబాద్ సరూర్నగర్లో నిరుద్యోగులతో భారీ బహిరంగ సభ ఉంటుందని ప్రకటించారు. ఆ సభకు ప్రియాంక గాంధీని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు రేవంత్రెడ్డి.
BJP, BRS పార్టీలు ప్రజలను మోసం చేయడమే అజెండాగా పెట్టుకున్నాయని రేవంత్రెడ్డి ఆరోపించారు. TSPSC పేపర్ లీక్ విషయంలో కోర్టును కూడా ప్రభుత్వం తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందన్నారు. కేసీఆర్ తన కుటుంబసభ్యులకు ఉద్యోగాలు ఇచ్చుకున్నారని.. కానీ విద్యార్థులకు మేలు చేయలేకపోయారన్నారు.
మరోవైపు, నిరుద్యోగ సభ ముగిసిన వెంటనే.. హాత్ సే హాత్ జోడో రెండో విడత పాదయాత్రకు సిద్ధమవుతున్నారు పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి. మే 9 నుంచి రేవంత్ రెండో విడత పాదయాత్ర.. జోగులాంబ జిల్లా నుంచి ప్రారంభం కానుంది. గతంలో వైఎస్సార్ మాదిరే.. మండుటెండలో రేవంత్ యాత్రకు సమాయత్తమవుతుండటం ఆసక్తికరంగా మారింది.