Revanth Reddy: అసలే రేవంత్. ఫైర్బ్రాండ్ లీడర్. ప్రత్యర్థులపై విరుచుకుపడటమే ఆయన స్టైల్. అలాంటిది.. ఆయన్నే కెలికితే? ఊరుకుంటారా.. ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు రేవంత్రెడ్డి. ఉచిత విద్యుత్పై నడుస్తున్న రచ్చలో భాగంగా.. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డిలు టీపీసీసీ చీఫ్ రేవంత్పై పలు విమర్శలు చేశారు. కౌంటర్గా ఆయన కేసీఆర్ పాత చరిత్ర అంతా తవ్విపోశారు. గులాబీ బాస్కు ఊడిగం చేస్తున్నారంటూ పోచారం, గుత్తాలను కడిగి పడేశారు. ఇంతకీ రేవంత్రెడ్డి చెప్పిన కేసీఆర్ చరిత్ర ఏంటంటే…
“1999లో టీడీపీ HRD ఛైర్మన్గా కేసీఆర్ చేసిన సూచనల మేరకే ఉచిత కరెంట్ ఇవ్వడం కుదరదని అప్పటి సీఎం చంద్రబాబు చెప్పారు. అప్పుడు పోచారం మంత్రి.. గుత్తా టీడీపీలో పెద్ద నాయకుడు. కాంగ్రెస్, కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి పిలుపిస్తే.. 2000 ఆగస్టు 28న.. బషీర్బాగ్లో కాల్పులు జరిపి.. ముగ్గురు రైతులను బలిగొన్నారు. ఆ సమయంలో అసెంబ్లీలో చంద్రబాబుతో పాటు కేసీఆర్, పోచారం కూడా ఉన్నారు. వారి సూచన మేరకే పోలీసులకు ఫైరంగ్ ఆర్డర్స్ వచ్చాయి”.. అంటూ సంచలన విషయాలు వెల్లడించారు రేవంత్రెడ్డి. తాను 2007లో టీడీపీలో చేరానని.. అలాంటి తనను చంద్రబాబు మనిషంటూ లింకులు పెట్టి మాట్లాడటంపై మండిపడ్డారు పీసీసీ చీఫ్.
1999లో డిప్యూటీ స్పీకర్గా ఉన్న కేసీఆర్.. మంత్ర పదవి కోసం సీఎం చంద్రబాబు ఇంటి చుట్టూ తొమ్మిది నెలల పాటు ప్రతీరోజూ తిరిగే వారని చెప్పారు రేవంత్. అవసరమైతే చంద్రబాబు చెప్పులు మోసేందుకు సైతం సిద్దమయ్యారని అన్నారు. బాబు ఇంటి చుట్టూ కేసీఆర్ తిరిగారని చెప్పడానికి ఐదుగురు వ్యక్తులను సాక్షంగా చెప్పారు రేవంత్రెడ్డి. అప్పటి టీడీపీ నేతలైన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావులతో పాటు ప్రస్తుతం ఓ మీడియా అధినేతగా ఉన్న మరో వ్యక్తి పేరు కూడా చెప్పారు.
అప్పట్లో మంత్రి పదవి రాలేదనే అక్కసుతో శ్రీకాకుళంకు చెందిన టీడీపీ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డినే కేసీఆర్తో పార్టీ పెట్టించారని.. జెండాలు, సభ్యత్వ పుస్తకాల ఖర్చు కోసం రూ.కోటి ఆర్థిక సాయం కూడా చేశారని చెప్పారు. ఆ ఆంధ్రానేత ఇచ్చిన డబ్బులతోనే కేసీఆర్.. టీఆర్ఎస్ పెట్టారని అన్నారు రేవంత్రెడ్డి.
2000 ఆగస్టులో బషీర్బాగ్ కాల్పులు జరిగాక కూడా కేసీఆర్ టీడీపీలోనే ఉన్నారని.. 2001 ఏప్రిల్ 21న పార్టీకి రాజీనామా చేసి.. ఏప్రిల్ 27న టీఆర్ఎస్ స్థాపించారని చెప్పారు రేవంత్రెడ్డి. ఆ సమయంలో పాలిటెక్నిక్ చదువుతూ హరీశ్రావు.. కేసీఆర్ ఇంట్లో టెలిఫోన్ ఆపరేటర్గా ఉండేవారని గుర్తు చేశారు. అలాంటి హరీశ్రావును మంత్రిని చేసిందే వైఎస్సార్, కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. హరీశ్కు ఏం అర్హత ఉందని ఆర్థిక మంత్రిని చేశారని ప్రశ్నించారు రేవంత్.