Revanth Reddy : ప్రజాగాయకుడు, పోరాటయోధుడు గద్దర్ అంటే చాలా మందికి ఇష్టమే. ఆయనపై ఎక్కువ ప్రేమను పెంచుకున్నవారు ఉంటారు. అలాంటి వారిలో ఒకరు టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి. చిన్నతనం నుంచి గద్దర్కు అభిమాని అయిన రేవంత్ ఇటీవల గద్దర్ ను కాంగ్రెస్లోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. మరికొన్ని రోజుల్లోనే కాంగ్రెస్లో గద్దర్ చేరతారనే ప్రచారం జరిగిన నేపథ్యంలో.. ఒక్కసారిగా ఊహించని ఘటన జరిగింది. గద్దర్ మృతి వార్త విన్న రేవంత్రెడ్డి.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటి నుంచి.. అంత్యక్రియలు వరకూ అన్నీ తానై చూసుకుంటున్నారు.
గద్దర్ మరణవార్త తెలియగానే తెలంగాణ వ్యవహారాల కాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే తో కలిసి రేవంత్ రెడ్డి అపోలో ఆస్పత్రికి వెళ్లారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారికి ధైర్యం చెప్పారు. గద్దర్ పై తనకు అభిమానాన్ని ట్వీట్ ద్వారా తెలియజేశారు.
గద్దరన్నా.. నువ్వు నా జీవిత కాల జ్ఞాపకం
నీ గానం.. తెలంగాణ వేదం
నీ గజ్జె.. తెలంగాణ గర్జన
నీ గొంగడి.. తెలంగాణ నడవడి
నీ గొంతుక.. తెలంగాణ ధిక్కార స్వరం
నీ రూపం.. తెలంగాణ స్వరూపం
గద్దరన్న.. నువ్వు నా జీవిత కాల జ్ఞాపకం
నీ మరణం.. నా గుండెకు శాశ్వత గాయం అంటూ రేవంత్ సంతాపం ప్రకటించారు.
ఇటీవలే ఖమ్మంలో రాహుల్ గాంధీతో గద్దర్ ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. రాహుల్ను కౌగిలించుకుని ముద్దాడారు. ఆ సమయంలో ఆయన్ను రాహుల్కు పరిచయం చేసింది రేవంత్రెడ్డే. తర్వాత అస్వస్థతకు గురైన గద్దర్ యోగక్షేమాలను ఎప్పడికప్పుడు తెలుసుకుంటూ… వైద్యంపైనా ఆరా తీస్తూనే ఉన్నారు రేవంత్.
కాంగ్రెస్ చేసిన పోరాటం వల్లే.. గద్దర్కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సర్కారు నిర్ణయం తీసుకుంది. ఆయన మరణించే సమయానికి అసెంబ్లీలో సమావేశాలు జరుగుతున్నాయి. గద్దర్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరగవంటూ వార్తలు వచ్చాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజాగాయకుడి అంత్యక్రియలు అధికార లాంఛనాలతో చేయాలంటూ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. తప్పని స్థితిలో సర్కారు ఒప్పుకోవలసి వచ్చింది.
గద్దర్ అంత్యక్రియుల్లో కాంగ్రెస్ నేతలతోపాటు ప్రతి ఒక్క కార్యకర్తా పాల్గొనాలని రేవంత్ పిలుపునిచ్చారు. గద్దర్ పార్థీవ దేహాన్ని ఎల్పీ స్టేడియంలో సందర్శనార్థం ఉంచాలనేది కూడా రేవంత్ ఆలోచనే. అందువల్లే తెలుగు రాష్ట్రాల్లోని వేల సంఖ్యలో ఉన్న గద్దర్ అభిమానులు… నివాళులు అర్పించే అవకాశం దక్కింది. కుటుంబంలో ఒకరిగా.. రేవంత్రెడ్డి.. ప్రతి అంశంలోనూ జోక్యం చేసుకుని అన్నీ తానై గద్దర్కు ఘనంగా వీడ్కోలు పలికే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రజా యుద్ధనౌకపై తనకు అభిమానాన్ని ఈ విధంగా చాటుకున్నారు.