అసలే రేవంత్రెడ్డి. అలాంటి ఆయనపై అసెంబ్లీలో కేసీఆర్, కేటీఆర్ విరుచుకుపడితే ఊరుకుంటారా? తనపై, కాంగ్రెస్పై వాళ్లు చేసిన విమర్శలకు.. హైరేంజ్లో రియాక్ట్ అయ్యారు పీసీసీ చీఫ్. ఢిల్లీలో ప్రెస్మీట్ పెట్టి.. కేసీఆర్, కేటీఆర్ రాజకీయాలను కుళ్లబొడిచారు. తెలంగాణపై తన చిత్తశుద్ధిని శంకించడం.. తాను చంద్రబాబు మనిషినంటూ ఆరోపించడంపై మండిపడ్డారు. తన రాజకీయ ప్రస్థానం, తెలంగాణపై తన ధృఢచిత్తం ఎలాంటిదో వివరించి చెప్పారు.
1999లోనే, తనకు 30 ఏళ్ల వయస్సులోనే.. జూబ్లీహిల్స్ సొసైటీకి డైరెక్టర్గా ఎంపికైన మొనగాడిని తానన్నారు రేవంత్రెడ్డి. అప్పుడు జూబ్లీహిల్స్ సొసైటీలో ఓటర్లుగా ఉన్న రాజకీయ, సినీ, న్యాయ ప్రముఖులు తనకు ఓటేసి గెలిపించారని గుర్తు చేశారు. 2006లో జెడ్పీటీసీగా గెలిచి.. ఆ తర్వాత ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీ అయ్యానని చెప్పారు. 2007లో అప్పటి ప్రతిపక్ష టీడీపీలో చేరానని.. చంద్రబాబుకు సహచరుడిగా ఉన్నానని అన్నారు. అప్పుడూ ఇప్పుడూ ఏ నాడూ తాను తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదని తెలిపారు.
కేసీఆర్ మాత్రం సింగిల్ విండోకి ఓడిపోయి.. యూత్ కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయి.. దిక్కులేని స్థితిలో టీడీపీలో చేరారని అన్నారు. చంద్రబాబు చెప్పుచేతుల్లో పడిఉండేవారని చెప్పారు. అప్పటి అసెంబ్లీలో 610 జీవోకి అనుకూలంగా మాట్లాడిన తెలంగాణ ద్రోహి కేసీఆర్ అంటూ అసెంబ్లీ రికార్డులు తిరగేసి.. ఆనాడు కేసీఆర్ మాట్లాడిన ప్రసంగాన్ని చదివి వినిపించారు.
ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో గవర్నర్ నరసింహన్ ప్రసంగాన్ని అడ్డుకుని సభ నుంచి బహిష్కరించబడిన చరిత్ర తనదని గుర్తు చేశారు. తాను టీడీపీలో ఉండి తెలంగాణ వాయిస్ వినిపించానని.. చంద్రబాబుతో తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇప్పించానని చెప్పారు. అదే కేసీఆర్ మాత్రం అడుగడుగునా తెలంగాణకు ద్రోహం చేస్తూ వచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో కేంద్రమంత్రి అయ్యారని.. ఎమ్మెల్యే కాకుండానే అల్లుడిని మంత్రిని చేశారని అన్నారు. ఆనాడు మహబూబ్నగర్ నుంచి కేసీఆర్ ఎంపీగా పోటీ చేస్తే.. ఆయన జెండా మోసే దిక్కులేకపోతే.. తానే కేసీఆర్ను గెలిపించానని చెప్పారు రేవంత్రెడ్డి.
టీఆర్ఎస్ ఎమ్మెల్సీలను అప్పటి సీఎం కిరణ్కుమార్ రెడ్డికి అమ్మేసుకున్నారని.. ఆ తర్వాత ఆ ఎమ్మెల్సీలపై వేటు వేసి బలిపశువులను చేశారని అన్నారు. మరో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి చెందిన దత్తాత్రేయ, యెండెలా లక్ష్మీనారాయణలతో అంటకాగారని విమర్శించారు. టైగర్ ఆలె నరేంద్ర, రాములమ్మ పార్టీలను టీఆర్ఎస్లో విలీనం చేసుకొని.. ఆ తర్వాత వారిని వదిలేశారని.. ఆలె నరేంద్ర చావుకు కేసీఆర్ కారణమయ్యారని.. చెల్లి అని చెప్పిన విజయశాంతికి ద్రోహం చేశారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్రెడ్డి.
సిరిసిల్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలు పాపారావును, మహేందర్రెడ్డిలను మోసం చేసి ఆ నియోజకవర్గాన్ని కొడుకు కేటీఆర్కు కట్టబెట్టారని అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ చనిపోతే పోలేదని.. తెలంగాణను తీవ్రంగా వ్యతిరేకించిన ఎమ్ఐఎమ్తో పొత్తు పెట్టుకున్నారని.. అందరినీ అవసరానికి వాడేసుకుని, దగా చేసిన దగాకోరు కేసీఆర్ అంటూ రేవంత్రెడ్డి ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు.
ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 25కు మించి సీట్లు కూడా రావని.. బీఆర్ఎస్కు పిండం పెడతామని.. కేసీఆర్ను రాళ్లతో కొడతామని.. ఇదే తన శపథం అంటూ రేవంత్రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.