Revanth Reddy | ఓటమి భయంతో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై పచ్చి అబద్దాలు చెప్తున్నారని ముఖ్యమంత్రిపై పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి విరుచుకుపడ్డారు. రెండో విడత బస్సుయాత్రలో భాగంగా సంగారెడ్డి బహిరంగ సభలో ఆయన మాట్లాడారు
ఓటమి భయంతో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై పచ్చి అబద్దాలు చెప్తున్నారని ముఖ్యమంత్రిపై పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి విరుచుకుపడ్డారు. రెండో విడత బస్సుయాత్రలో భాగంగా సంగారెడ్డి బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. లేని మాటల్ని అన్నట్టు ఒక ముఖ్యమంత్రి చెప్పడం సిగ్గుచేటన్నారు రేవంత్రెడ్డి.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇచ్చిన ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామని టీపిసీసీ అధ్యక్షడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సంగారెడ్డి బహిరంగ సభలో మాట్లాడుతూ.. కర్నాటకలో కాంగ్రెస్ ఇచ్చిన అయిదు గ్యారంటీలను అమలు చేయడం లేదని కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ అంశంపై సీఎం కేసీఆర్కు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఇచ్చిన హామీలు అమలవుతున్నాయో లేదో కర్ణాటకకు వెళ్లి చూద్దాం రమ్మని ఆయన కేసీఆర్ ఛాలెంజ్ చేశారు.
”కర్ణాటకకు తీసుకెళ్లడానికి బస్సు సిద్ధంగా ఉంది. ప్రగతి భవన్ రావాలా… ఫామ్ హౌజ్ రావాలా కేసీఆర్.. చెప్పు.. ఇదే మీకు మా సవాల్. పోతూ పోతూ మేడిగడ్డ మీదుగా పొయ్యి.. నువ్వు కట్టిన నాణ్యతలేని ప్రాజెక్ట్ చూసుకుంటా పోదాం. పనిమంతుడు పందిరి వేస్తె కుక్క తోక తాకి కూలిందంట. కేసీఆర్ కట్టిన మేడిగడ్డ పరిస్థితి మేడిపండులా ఉంది. వీళ్లను కొరడాతో కొట్టాలి. జైలో వేసి చిప్ప కూడు తినిపించాలి” అని రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
మాట నిలబెట్టుకునే చరిత్ర కాంగ్రెస్ పార్టీది
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్ర ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని తెలిసినా.. సోనియా గాంధీ ఇచ్చిన మాట కోసం తెలంగాణ ఇచ్చారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని బీఆర్ఎస్పై మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో జీతాలు, పెన్షన్లు ఎప్పుడూ పడతాయో తెలియని పరిస్థితి ఆయన ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అందుకే సోనియా మరోసారి పూనుకొని తెలంగాణలో 6 గ్యారంటీలు అమలు చేస్తామని నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్ అమలు చేస్తున్న హామీలను చూపిస్తాం.. రమ్మని డీకే శివ కుమార్ సవాల్ విసిరితే… కేటీఆర్ తోక ముడిచారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
అలాగే రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్, ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంటు, రైతు భరోసా పథకం కింద ఎకరాకు ప్రతి సంవత్సరం రూ.15,000, ఉపాధి హామి పథకం కింద ప్రతి కూలీకి ప్రతి సంవత్సరం రూ.12000 కాంగ్రెస్ ప్రభుత్వ ఇస్తుందని హామీ ఇచ్చారు. తెలంగాణలో రాబోయే ఎన్నికలలో గెలిచి డిసెంబర్ 9న, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు.
తెలంగాణ ఎన్నికలో కాంగ్రెస్ గెలుపుతో ఏర్పడబోయే ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించే నాయకుడు జగ్గారెడ్డిని గెలిపించడానికి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఖర్గే ఇక్కడకు వచ్చారని అన్నారు. జగ్గన్నను 50 వేల భారీ మెజారిటీతో గెలిపించాలని, రేవంత్ రెడ్డి ప్రజలను కోరారు.
ఇచ్చిన హామీలను నెరవేర్చని కేసీఆర్ : మల్లికార్జున ఖర్గే
ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, నిరుద్యోగ భృతి, పావలా వడ్డీ రుణాలు, సాగు నీళ్లు… ఇలా ఏ హామీనీ సీఎం కేసీఆర్ నేరవేర్చలేదని సభలో పాల్గొన్న కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. పండించిన పంటను అమ్ముకోలేక కల్లాల్లో రైతులు చనిపోతున్న పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపించారు.