Revanth Reddy | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధికార బీఆర్ఎస్ పార్టీపై మండిపడ్డారు. రాజేంద్రనగర్లో బుధవారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ప్రజా గర్జన సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధికార బీఆర్ఎస్ పార్టీపై మండిపడ్డారు. రాజేంద్రనగర్లో బుధవారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ప్రజా గర్జన సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సభలో ఆయన మాట్లాడుతూ.. ” తెలంగాణలో రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్నట్లు బీఆర్ఎస్ నిరూపిస్తే.. శంషాబాద్ చౌరస్తాలో ముక్కు నేలకు రాస్తాను,” అని గులాబీ పార్టీకి సవాలు చేశారు.
తెలంగాణలో కేసీఆర్ సాధించిన అభివృద్ధి బెల్టు షాపులు పెంచడం మాత్రమేనని ఎద్దేవా చేశారు. హైదరాబాద్లో అంతార్జాతీయ ఎయిర్ పోర్టు, ఓఆర్ఆర్ కాంగ్రెస్ నిర్మించిందని.. హైదరాబాద్కు కాంగ్రెస్ పార్టీతోనే అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని స్పష్టం చేశారు.
తెలంగాణలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని, తాగుడులో తెలంగాణను నంబర్ వన్ చేశారని రేవంత్రెడ్డి సీఎం కేసీఆర్పై మండిపడ్డారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎందరికి ఇచ్చారని, కాంగ్రెస్ సునామీలో బీఆర్ఎస్ కొట్టుకుపోతుందని రేవంత్రెడ్డి జోస్యం చెప్పారు. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రూ.4 వేలు పెన్షన్ ఇస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.