Revanth Reddy latest news(TS politics): కొన్నిరోజులుగా వ్యవసాయ రంగంపై తెలంగాణలో చర్చ నడుస్తోంది. ఉచిత విద్యుత్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి. ఈ అంశంపై బీఆర్ఎస్ , కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రాష్ట్రంలో 24 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. ఎక్కడా కూడా నిరంతరాయంగా ఉచిత విద్యుత్ ఇవ్వడంలేదని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు.
ఇదే అంశంపై రేవంత్ రెడ్డి, మంత్రి కేటీఆర్ మధ్య డైలాగ్ వార్ నడిస్తోంది. తాజాగా ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్పై మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి. తనదైన శైలిలో సెటైర్లు వేశారు. వ్యవసాయం అంటే అమెరికాలో అంట్లుతోమడం.. జూబ్లీహిల్స్ గెస్ట్హౌస్లో సేద తీరడం.. సినిమా వాళ్లతో పార్టీలు చేసుకోవడం కాదన్నారు రేవంత్. వ్యవసాయం అంటే మట్టి మనుషుల పరిమళం, మట్టి మనుషుల ప్రేమ అన్నారు. ఎడ్లు, వడ్లు అని ప్రాసకోసం పాకులాడే గాడిదలకు ఏం తెలుసు గంధపు చెక్కల వాసన అని మంత్రి కేటీఆర్ను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు రేవంత్.