TSPSC: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై కాంగ్రెస్ పోరాటం మరింత ఉధృతం చేసింది. NSUI విభాగం పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తుండగా.. పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి మంత్రి కేటీఆర్ టార్గెట్గా సంచలన ఆరోపణలు చేస్తున్నారు. పేపర్ లీకేజీలో కేటీఆర్ పీఏ తిరుపతి హస్తం ఉందన్నారు. గత గ్రూప్ 1 పరీక్ష పేపర్ సైతం లీక్ అయిందని.. ఎన్నారైలకు పేపర్లు అమ్ముకున్నారని తీవ్ర విమర్శలు చేశారు రేవంత్. కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ వేయగా.. ఇప్పుడు నేరుగా గవర్నర్ను కలిసి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ పార్టీ.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో గవర్నర్ తనకున్న విచక్షణాధికారాలను వాడాలని రేవంత్రెడ్డి కోరారు. మంత్రి కేటీఆర్నూ ప్రాసిక్యూట్ చేయాలని అన్నారు. టీఎస్పీఎస్సీలో జరిగిన అవకతవకలకు కేటీఆర్ మంత్రిగా ఉన్న ఐటీ శాఖే కారణమన్నారు. సిట్ విచారణను ఎదుర్కోవాల్సిన టీఎస్పీఎస్సీ ఛైర్మన్, కార్యదర్శి, సెక్షన్ ఆఫీసర్ను కాపాడే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 317 ప్రకారం టీఎస్పీఎస్సీలో బాధ్యులైన వ్యక్తులను గవర్నర్ సస్పెండ్ చేయొచ్చని.. తద్వారా పారదర్శకమైన విచారణ జరిగేందుకు అవకాశం ఉంటుందని తమిళిసైకి విజ్ఞప్తి చేశారు రేవంత్రెడ్డి బృందం.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదుపై గవర్నర్ సానుకూలంగా స్పందించారు. పేపర్ లీకేజీ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నానని.. తాను రాజ్యాంగ విధులకు లోబడి పని చేయాల్సి ఉంటుందని.. న్యాయ నిపుణులతో చర్చించి చర్యలు తీసుకుంటానని కాంగ్రెస్ నేతలకు హామీ ఇచ్చారు గవర్నర్ తమిళిసై.