TSPSC: టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజీ వ్యవహారం రాజకీయ మలుపులు తిరుగుతోంది. కల్వకుంట్ల కుటుంబానికి సంబంధం ఉందని.. మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని.. విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆ ఏ2 నిందితుడు రాజశేఖర్రెడ్డి బీజేపీ లీడరని.. లీకేజీలో ఆ పార్టీకి సంబంధం ఉందని కేటీఆర్ రివర్స్ అటాక్ చేస్తున్నారు. పరీక్ష రద్దు చేశామని.. త్వరలోనే మళ్లీ నిర్వహిస్తామని.. అభ్యర్థుల కోసం వెబ్సైట్లో కోచింగ్ మెటీరియల్.. 24 గంటల పాటు రీడింగ్ రూమ్స్.. లాంటి తాయిలాలు ప్రకటించింది ప్రభుత్వం.
లేటెస్ట్గా పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి రంగంలోకి దిగి మరింత సంచలన ఆరోపణలు చేశారు. TSPSC పేపర్ లీకేజీ ఘటనలో మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతి హస్తం ఉందని అన్నారు. తిరుపతి స్వగ్రామం మల్యాలలో 100 మంది అభ్యర్థులకు 100కు పైగా మార్కులు వచ్చాయని.. అదెలా సాధ్యం అని ప్రశ్నించారు. కేటీఆర్ పీఏకు.. పేపర్ లీకేజీకి లింకు ఉందని.. ఆ మేరకు తన దగ్గర పక్కా సమాచారం ఉందన్నారు రేవంత్రెడ్డి. తనకు వచ్చిన సమచారం ఇంతవరకూ ఎప్పుడూ తప్పుకాలేదని.. అందుకే లీకేజీ కేసులో సమగ్ర విచారణ జరిపించాలని రేవంత్ డిమాండ్ చేశారు.
ఇలా పేరు, ఊరు చెబుతూ.. రేవంత్రెడ్డి బహిరంగంగా, పదునైన ఆరోపణలు చేశారంటే.. ఆయనేమీ అల్లాటప్పాగా ఆ వ్యాఖ్యలు చేసి ఉండరు. పక్కా సమాచారమే ఉండి ఉంటుంది. పకడ్బందీగా దర్యాప్తు జరిపితే.. అసలు నిందితులెవరో తేలుతుంది.. అంటున్నారు నిరుద్యోగులు.