Revanth Reddy : రైతుబంధు నిధుల విడుదల అంశం తెలంగాణ ఎన్నికల్లో కీలకంగా మారింది. ఎప్పుడో ఈ నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉన్నా.. కేసీఆర్ ప్రభుత్వం ఆ పని చేయలేదు. తొలుత ఈ నెపాన్ని కాంగ్రెస్ పై పెట్టే ప్రయత్నం చేసింది. ఈసీకి ఫిర్యాదు చేసి కాంగ్రెస్ నేతలే రైతుబంధును అడ్డుకుంటున్నారని ఆరోపించింది.
కాంగ్రెస్ మాత్రం రైతుబంధు ఇస్తే తమ పార్టీకి అభ్యంతరం లేదని తేల్చిచెప్పింది. వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని కోరింది. తాము ఈసీ ఎలాంటి ఫిర్యాదు చేయలేదని క్లారిటీ ఇచ్చింది. ఫిర్యాదుపై ఆధారాలుంటే చూపాలని సవాల్ చేసింది. దీంతో బీఆర్ఎస్ నేతలు సైలెంట్ అయిపోయారు. ఆ అంశాన్ని ప్రస్తావించడం మానేశారు. కాంగ్రెస్ ఎన్నిసార్లు డిమాండ్ చేసినా రైతుబంధు రైతుల ఖాతాల్లో జమ చేయలేదు. కానీ ఇప్పుడు ఎన్నికల సమీపిస్తున్న సమయంలో రైతుబంధు నిధులను రైతు ఖాతాల్లో జమ చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధమైంది.
రైతులను ప్రభావితం చేసేలా పోలింగ్కు 4 రోజుల ముందు రైతుబంధు నిధుల విడుదలకు ఈసీ అనుమతివ్వడంపై రేవంత్రెడ్డి అనుమానాలు వ్యక్తం చేశారు. రైతుబంధు నిధులు ముందుగానే విడుదల చేయాలని కాంగ్రెస్ కోరినా ఈసీ పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు అనుమతి ఇవ్వడం వెనుక కేంద్ర ప్రభుత్వం పాత్ర ఉందన్నారు. దీంతో బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని రుజువైందని ఆయన వ్యాఖ్యానించారు.
ఇప్పుడు రైతుబంధు నిధులు విడుదల చేయడం వల్ల రైతులకు 5 వేల రూపాయల నష్టం జరుగుతుందన్నారు రేవంత్ రెడ్డి. రైతుబంధు డబ్బులు అకౌంట్లో పడ్డాయని రైతులు ప్రభావితం కావొద్దని సూచించారు. కాంగ్రెస్ వస్తే మరో 5 వేలు ఎక్కువ వచ్చేవి కదా? అని రైతులు బాధపడొద్దన్నారు. ఇప్పుడు కేసీఆర్ ఇచ్చే 5 వేలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జనవరిలో ఇవ్వాల్సినవి ఇస్తామని రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు.
కేసీఆర్ను జేసీబీలు, క్రేన్లు పెట్టి లేపాలని మోదీ ప్రయత్నించినా ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవదని రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. ఏకే గోయల్ ఇంటి నుంచి రూ.1000 కోట్లు పంచారని కాంగ్రెస్ ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. సీఈవో వికాస్రాజ్ కు తాము ఫోన్లు చేస్తే లిఫ్ట్ చేయలేదన్నారు.
కాంగ్రెస్ నేతలనే టార్గెట్ చేసి ఐటీ దాడులు చేస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈడీ, ఐటీ కేవలం కాంగ్రెస్ నేతల ఇళ్లలో సోదాలు చేసేందుకే ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ బీజేపీ, బీఆర్ఎస్తో కాదని ఈడీ, ఐటీతోనేనని స్పష్టం చేశారు.