RevanthReddy: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. డైనమిక్ లీడర్. ఆయన మాటలు డైనమైట్లలా పేలుతుంటాయి. డైలాగులు తూటాల్లా విరుచుకుపడుతుంటాయి. అందుకే రేవంత్ రెడ్డి అంటే అంత క్రేజ్. ఆ మాటల వల్లే ప్రజల్లో ఆయనకు ఇంతటి ఇమేజ్. పక్కా లీడర్ షిప్ క్వాలిటీస్ ఉన్న నాయకుడు. కేసీఆర్ కు కరెక్ట్ మొగుడంటూ కాంగ్రెస్ భావన. ప్రజల్లోనూ రేవంత్ రెడ్డికి హ్యూజ్ ఫాలోయింగ్ ఉంది. కేసీఆర్ పై బలంగా పోరాడగల సత్తా ఉన్న నేతగా రేవంత్ రెడ్డికి బాగానే క్రెడిట్ ఉంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. దూకుడు మీదుండే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రసంగాలకంటే కూడా.. రేవంత్ రెడ్డి డైలాగ్స్ కే డిమాండ్ ఎక్కువ. అలాంటి రేవంత్ రెడ్డి.. పాదయాత్రతో ఫుల్ జోష్ మీదున్నారు. వస్తున్న ప్రజాదరణ చూసి మరింత రెచ్చిపోయినట్టున్నారు. ప్రగతి భవన్ పై బాంబులేయాలంటూ బాంబుల్లాంటి డైలాగులు పేల్చారు. ఇదే ఇప్పుడు మోస్ట్ కాంట్రవర్సీగా మారిపోయింది. ఇంతకీ రేవంత్ రెడ్డి నోరు జారారా? కావాలనే అన్నారా?
ప్రగతి భవన్ ఆనాటి దొరల గడీలను తలపిస్తున్నాయని.. ప్రజలకు ప్రవేశం లేని ప్రగతిభవన్ ను పేల్చేయాలంటూ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో నక్సలైట్లు గడీలను గ్రానైడ్లతో పేల్చేసినట్టు.. ప్రగతి భవన్ ను సైతం పేల్చేయాలని పిలుపునివ్వడం కలకలం రేపుతోంది. రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు. డీజీపీని కలిసి రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు ఎమ్మెల్సీలు. చాలాచోట్ల రేవంత్ పై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు ఇచ్చారు బీఆర్ఎస్ నేతలు. ఇలా రేవంత్ రెడ్డి కామెంట్లపై ఫుల్ కాంట్రవర్సీ నడుస్తోంది.
ప్రగతి భవన్ ను పేల్చేయాలని అనడం కాస్త రాడికల్ డైలాగే అంటున్నారు. అందులోనూ నక్సలైట్లు ప్రగతిభవన్ ను పేల్చాయాలని చెప్పడం.. మావోయిస్టులకు మద్దతుగా మాట్లాడినట్టు అవుతుందని కొందరు విమర్శిస్తున్నారు. అయితే, అలాంటిదేమీ లేదని.. రేవంత్ రెడ్డి మాటల్లో భావాన్ని చూడాలి కానీ, వాడిన పదాలకు అంతగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదనే వారూ ఉన్నారు. పేల్చేయడం, బాంబులు వేయడం లాంటి పదాలు నిషిద్ధ జాబితాలో ఉన్నాయా? అని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఇదే టీఆర్ఎస్ నేతలు బాబ్రీ ప్రాజెక్టును బాంబులతో పేల్చేస్తామని అనలేదా? అని కాంగ్రెస్ శ్రేణులు గుర్తు చేస్తున్నారు. ప్రాజెక్టులు పేల్చేస్తామంటే తప్పులేదు కానీ.. ప్రగతిభవన్ పేల్చేయాలంటే తప్పా అని అంటున్నారు. ఏదో ఫ్లోలో అంటే అని ఉంటారు కానీ.. రేవంత్ ఉద్దేశం అది కాకపోవచ్చని.. ప్రగతి భవన్ ప్రజలకు పనికిరాకుండా పోయిందని ఆవేదన, ఆగ్రహంతోనే అలా అని ఉంటారని సమర్థిస్తున్నారు కాంగ్రెస్ నేతలు.