Revanth Reddy : నాణ్యతా లోపం వల్లే మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. లక్ష కోట్ల తో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఎంత నాసిరకంగా ఉందో మేడిగడ్డ బ్యారేజ్ నిరూపిస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని రాహుల్ గాంధీ చెప్పిన 48 గంటల్లోనే అది నిరూపితమైందన్నారు. మానవ అద్భుతం అని చెప్పే కాళేశ్వరంలో ఏం జరుగుతుందో అందరికీ అర్థమవుతోందని తెలిపారు.
కాళేశ్వరం కేసీఆర్ కు ఏటీఎంగా మారిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ ప్రాజెక్టులో అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని కోరారు.సెంట్రల్ విజిలెన్స్ కమిషన్తో దర్యాప్తు చేయించాలన్నారు. గతంలో కాళేశ్వరం మునిగిపోయినప్పుడు వరదలు సాకుగా చూపించారని అన్నారు. మరి ఇప్పుడు వరదలు లేవకదా అని ప్రశ్నించారు.
కేసీఆర్ అవినీతి గురించి ప్రశ్నించేవారిని బీఆర్ఎస్ నేతలు కించపరిచేలా మాట్లాడుతున్నారని రేవంత్ మండిపడ్డారు. ప్రాజెక్టులో ప్రమాదాలకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టులో అక్రమాలపై సిట్టింగ్ జడ్డితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు వచ్చి తమతో కలిసి ప్రాజెక్టును పరిశీలించాలన్నారు. ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోందని విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమని కేసీఆర్ గొప్పలు చెప్పారని.. రైతులను బస్సుల్లో తీసుకెళ్లి చూపించిన విషయాన్ని రేవంత్ గుర్తు చేశారు. పంపు హౌస్లు మునిగినపుడు కాంగ్రెస్ నేతలను వెళ్లనివ్వలేదన్నారు. ఇప్పుడు వరదలు లేకుండానే బ్యారేజీ కుంగిపోయిందన్నారు. కాళేశ్వరం విషయంలో అవినీతి జరిగిందని తొలు నుంచి తాము చెబుతున్నామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. నాణ్యత లేకుండా ఇష్టారాజ్యం ప్రాజెక్టును నిర్మించారన్నారు.