Revanth Reddy: కాంగ్రెస్లో ఎవరికి వారే. ఒకరి మాట ఇంకొకరు వినరు. పేరుకైతే పదవులు ఉంటాయి కానీ.. ఏ ఒక్కరూ పని చేసిన పాపాన పోరు. ఇప్పటి వరకూ ఇలానే హవా చెలాయించారు హస్తం నేతలు. ఇకముందు అలాగైతే కుదరదు. ఒళ్లు వంచి పని చేస్తేనే టికెట్లు.. ప్రజల్లోకి వెళితేనే పదవులు.. సర్వే రిపోర్టులతోనే సీట్లు.. వచ్చే ఆరు నెలలు కష్టపడి పని చేయాల్సిందేనని తేల్చి చెప్పారు పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి.
లీడర్ ఇన్ యాక్షన్. అవును, రేవంత్ రెడ్డి పార్టీపై పట్టు సాధించారు. ఓవైపు సీనియర్లను కలుపుకొని పోతూనే.. మిగతా పార్టీ కేడర్ను దారిని పెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి పదుల సంఖ్యలో ఉపాధ్యక్షులు, అంతకంటే ఎక్కువ సంఖ్యలో జనరల్ సెక్రటరీలు ఉంటారు. పేరుకైతే పదవులు ఉంటాయి కానీ.. చాలామంది ఆ పదవిని బాధ్యతగా భావించరు. పార్టీ కోసం కానీ, ప్రజల కోసం కానీ పని చేయరు. పార్టీలో పెత్తనం చేసేందుకు మాత్రం ముందుంటారు. గ్రూపు తగాదాలతో గబ్బుగబ్బు లేపుతారు. ఇటీవల వరంగల్ జిల్లాలో ఎర్రబెల్లి స్వర్ణ వర్గీయులపై కొండా మురళి సురేఖ అనుచరులు దాడి చేసిన ఘటన పార్టీలో కలకలం రేపింది. కాంగ్రెస్లో ఏళ్ల తరబడి ఇదే తీరు. ఇకపై ఇలాంటి ఆగడాలకు చెక్ పెట్టేలా.. రేవంత్రెడ్డి యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు.
అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంఛార్జిలుగా ఉన్న వారంతా ప్రతీ 15 రోజులకు ఒక రిపోర్ట్ పీసీసీకి పంపించాలని ఆదేశించారు. వచ్చే ఆరు నెలలు ప్రజల్లోనే ఉండాలని.. కలిసికట్టుగా ఉండాలని.. పనితనం ఆధారంగానే టికెట్లు ఇస్తామని తేల్చి చెప్పారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని.. సర్వేల ప్రాతిపదికనే టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. ఇందుకు, కర్ణాటకలో మంత్రి పదవి దక్కించుకున్న బోసురాజే ఉదాహరణ అని చెప్పారు.
గాంధీభవన్లో పార్టీ కీలక నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్లో పార్టీ ఇంఛార్జ్ మాణిక్ రావ్ థాక్రే సైతం పలువురు నేతల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. పని చేయకుండా పదవులు పట్టుకుని వేలాడితే ప్రయోజనం ఉండదని.. ఇకపై అలాంటి నేతలను ఉపేక్షించబోమని గట్టిగానే చెప్పారు.
ఒకప్పుడు ఇలాంటి మీటింగులను, వార్నింగులను పెద్దగా పట్టించుకునే వారు కాదు హస్తం నేతలు. కానీ, అసలే ఎలక్షన్ సీజన్. అందులోనూ కర్నాటక గెలుపుతో.. తెలంగాణలోనూ ఫుల్ జోష్ పెరిగింది. పొంగులేటి, జూపల్లి లాంటి బలమైన నాయకుల చేరికతో కొత్త ఉత్సాహం నెలకొంది. పీసీసీ చీఫ్ సైతం స్ట్రాంగ్గా ఉన్నారు. రేవంత్కు అధిష్టానం నుంచి మంచి సపోర్ట్ ఉంది. ఇలాంటి సమయంలో ఓ ఆర్నెళ్లు కష్టపడితే మళ్లీ అధికారంలోకి రావొచ్చని పార్టీ నేతలు సైతం గట్టిగా ఫిక్స్ అవుతున్నారు. ఇన్నాళ్లూ సరైన నాయకత్వం లేక, ఫిరాయింపులతో నిరుత్సాహం నెలకొనడా.. ఇప్పుడు మాత్రం హస్తం పార్టీలో మునుపెన్నడూ లేనంతా కేరింత కనిపిస్తోంది. అటు.. సభలు, పాదయాత్రలు, డిక్లరేషన్లు, రాహుల్, ప్రియాంకల పర్యటనలతో.. తెలంగాణ కాంగ్రెస్ నెవ్వర్ బిఫోర్.