Revanth Reddy: ఖమ్మం సభలో రాహుల్ వ్యాఖ్యలపై కౌంటర్లు ఇస్తున్న అధికార బీఆర్ఎస్ మంత్రులపై.. టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఎటాక్ చేశారు. వేల కోట్లు దోచుకుని, వందల ఎకరాల సంపాదించుకుని రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని.. అలాంటి వారు రాహుల్ ను విమర్శించడం హాస్యాస్పదం అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ను రాష్ట్రానికి గుదిబండగా మార్చారని.. ఆయకట్టు విషయంలో ప్రభుత్వం చెప్పేవన్నీ కాకి లెక్కలే అని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్పై కాగ్ ఇచ్చిన నివేదికపై మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుతో చర్చకు సిద్ధం అంటూ సవాల్ విసిరారు రేవంత్రెడ్డి.
ఖమ్మంలో కాంగ్రెస్ జనగర్జనను అడ్డుకునేందుకు ఓ సైకో మంత్రి ప్రయత్నం చేశాడని రేవంత్ మండిపడ్డారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబానికి తెలంగాణలో పర్యటించే అర్హత లేదని అనడం బీఆర్ఎస్ అహంకారానికి నిదర్శనం అన్నారు. పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్నా కూడా.. రాహుల్గాంధీ ఎలాంటి పదవి తీసుకోలేదని గుర్తు చేశారు. గాంధీ కుటుంబం దేశం కోసం ప్రధాని పదవినే త్యాగం చేసిందని.. రాహుల్ అర్హత గురించి మాట్లాడే అర్హత అవినీతిపరులైన కేసీఆర్ కుటుంబానికి ఎక్కడ ఉందని నిలదీశారు రేవంత్రెడ్డి.
కాంగ్రెస్ ప్రభుత్వం డిజైన్ చేసిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును.. రీడిజైన్ చేసి కాళేశ్వరంగా పేరు మార్చారని రేవంత్ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఓ తెల్ల ఏనుగని.. ఎంత ఖర్చు చేసినా దానికి సరిపోవడం లేదని.. ఈ విషయం కాగ్ తన నివేదికలో తెలిపిందని అన్నారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ కుటుంబ ఆస్తులు అమాంతం పెరిగిపోయాయని.. 2014 జూన్2 నాటికి కేసీఆర్ కుటుంబ ఆస్తులెన్ని? 2023 జులై 2న ఖమ్మంలో రాహుల్ సభ జరిగిన నాటికి కేసీఆర్ ఆస్తులు ఎన్ని? ఈ విషయంలో చర్చకు కేసీఆర్, కేటీఆర్ సిద్ధమా అని ప్రశ్నించారు రేవంత్.