Revanth Reddy: వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ సీఎం అవుతారు? అదే, బీజేపీ గెలిస్తే..? కిషన్ రెడ్డినో, బండి సంజయో.. అధిష్టానం ఎవరిని నియమిస్తే వారు. మరి, కాంగ్రెస్ గెలిస్తే..? మిగతా పార్టీల్లా రెండు పేర్లు వినిపించవు. సింగిల్ పర్సన్- రేవంత్ రెడ్డి. వైల్డ్ కార్డ్ ఎంట్రీ. ఎనీ డౌట్స్ అంటుంటారు ఆయన ఫ్యాన్స్. కాంగ్రెస్ శ్రేణులు సైతం రేవంతే సీఎం కావాలని కోరుతుంటారు. కానీ, సీనియర్లకు మాత్రమే రేవంత్ రెడ్డి అంటే గిట్టదు. పీసీసీ చీఫ్ పదవికే ఆయన సరిపోరంటూ విమర్శలు చేస్తుంటారు. ఎప్పుడెప్పుడు ఆయన్ను ఆ కుర్చీ నుంచి దించేద్దామా అని కుట్రలు చేస్తుంటారని అంటారు. ఇక, కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేవంత్ రెడ్డి పేరును సీనియర్లు అస్సలు ఒప్పుకోరు.
ఇక, రేవంత్ రెడ్డి సైతం తాను సీఎం క్యాండిడేట్ అని ఎప్పుడూ చెప్పుకోలేదు. ఆ విషయం ఎన్నికల తర్వాత తెలుస్తుందని అంటుంటారు. రేవంత్ మీటింగ్స్ జరిగినప్పుడల్లా పార్టీ కార్యకర్తలు, అభిమానులు రేవంత్ ను ఉద్దేశించి సీఎం..సీఎం.. అంటూ నినాదాలు చేస్తుంటారు. అలాంటి నినాదాలు వద్దంటూ కేడర్ ను గట్టిగానే హెచ్చరిస్తుంటారు రేవంత్ రెడ్డి. పలుమార్లు కార్యకర్తలకు సీరియస్ గా వార్నింగ్ కూడా ఇచ్చారు. వాళ్లు చేసే నినాదాలు పార్టీకి మంచిది కాదని అన్నారు.
లేటెస్ట్ గా సీఎం అభ్యర్థిపై మరింత క్లారిటీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. వికారాబాద్ కలెక్టరేట్ దగ్గర జరిగిన రైతు సమస్యలపై ధర్నాలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అక్కడ రేవంత్ సీఎం కావాలని కొందరు నేతలు నినాదాలు చేశారు. దీంతో, మరోసారి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిపై స్పందించారు రేవంత్ రెడ్డి.
“తాను సీఎం కావాలని కొందరు నినాదాలు చేస్తున్నారు.. కానీ ఈ వేదిక మీదుగా నేను ఓ విషయం చెప్పదల్చుకున్నా.. నేను సీఎం అయినా కాకపోయినా పర్వాలేదు.. కానీ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది” అన్నారు రేవంత్. సీఎం కేసీఆర్ ఎన్నికల కోసం తొందరపడుతున్నారని.. రాష్ట్రంలో ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చని.. కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపు ఇచ్చారు పీసీసీ చీఫ్.