Revanth Reddy latest news(Telangana politics): ఈటల హత్యకు కుట్ర చేస్తున్నారనే ఆరోపణ తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపింది. ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డి 20 కోట్ల సుపారీ ఇస్తానన్నారనే విషయం తమకు తెలిసిందంటూ ఈటల భార్య జమున సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి కుట్రలకు భయపడబోమంటూ.. నయీంనే ఎదిరించానంటూ.. రాజేందర్ సైతం హాట్ కామెంట్స్ చేశారు. కట్ చేస్తే.. మంత్రి కేటీఆర్ అలర్ట్ అయ్యారు. డీజీపీకి ఫోన్ చేసి.. ఈటల భద్రత పెంచాలని సూచించారు. ఏసీపీ స్థాయి అధికారి.. రాజేందర్ ఇంటికెళ్లి మరీ సెక్యూరిటీని పరిశీలించారు. ఆ వెంటనే ఈటలకు ‘వై ప్లస్’ కేటగిరి భద్రత కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ వ్యవహారం అంతా.. ఆగమేఘాల మీద.. చకచకా.. రెండు రోజుల గ్యాప్లోనే జరిగిపోవడం.. తెలంగాణలో మునుపెన్నడూ చూడని విషయం.
లేటెస్ట్గా ఈటల రాజేందర్ భద్రతపై టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి సైతం ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం సెక్యూరిటీ పెంచినంత మాత్రాన సరిపోతుందా? అని ప్రశ్నించారు. గతంలో పోలీసుల రక్షణలో ఉన్న పలువురు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని గుర్తు చేశారు. మరో లాజికల్ క్వశ్చన్ సైతం సంధించారు రేవంత్.
ఈటల హత్యకు కుట్ర అంటూ జమున ఆరోపించగానే.. పోలీసులు అదనపు భద్రత కల్పించారంటే.. దాని అర్థం ఆయన హత్యకు కుట్ర జరిగిందనే విషయాన్ని పోలీసులు అంగీకరించారన్నట్టేగా? అని అన్నారు. మరి, ఈటలను చంపాలనుకున్న వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించడం ఆసక్తిగా మారింది.
ఈ సందర్భంగా తనకు కల్పిస్తున్న భద్రతపైనా సర్కారును నిలదీశారు రేవంత్రెడ్డి. గతంలో హైకోర్టు తనకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని ఆదేశించిందని గుర్తు చేశారు. కోర్టు తీర్పుతో కొన్నిరోజులు సెంట్రల్ సెక్యూరిటీ ఇచ్చి ఆ తర్వాత తీసేశారని చెప్పారు. ఒకప్పుడు తనకు 4+4 గన్మెన్లు ఉండేవారని.. అందులోనూ కోత వేసి.. ప్రస్తుతం 2+2 గన్మెన్స్తో మాత్రమే సెక్యూరిటీ కల్పిస్తున్నారని అన్నారు. తాను ఎంపీ అయినా, పీసీసీ చీఫ్ అయినా.. తన భద్రతను పెంచగ పోగా.. మరింత తగ్గించారని మండిపడ్డారు. కనీసం ఈటల రాజేందర్కైనా అదనపు సెక్యూరిటీ కల్పిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు రేవంత్రెడ్డి.