Revanth Reddy : తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతం కోసం తీవ్రంగా శ్రమిస్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి….. మరో భారీ టార్గెట్ ను నిర్దేశించుకున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రజల్లోకి తీసుకెళ్లడమే ప్రధాన అజెండాగా పాదయాత్ర చేపట్టనున్నారు.
జనవరి 26 నుంచి రేవంత్ పాదయాత్ర మొదలుకానుంది. రెండు నెలల పాటు యాత్ర సాగనుంది. హాత్ మే హాత్ జోడో పేరిట యాత్ర చేయనున్నారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నట్లుగా తెలిసింది. అయితే పాదయాత్రలో సీనియర్లు పాల్గొంటారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉంటే…ఢిల్లీకి రావాలని టీ కాంగ్రెస్ సీనియర్లకు హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. ఒకటీ రెండు రోజుల్లో పార్టీ సీనియర్లు ఢిల్లీకి వెళ్లనున్నారు. కమిటీల కూర్పుపై ఇటీవల పలువురు సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో హైకమాండ్ పిలుపు ప్రాధాన్యత సంతరించుకుంది