Revanth Nomination : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ ల గడువు నేటితో ముగియనుంది. అన్ని పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల పోరుకు రెడీ అయ్యారు. సీఎం కేసీఆర్ రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. చివరి ఎన్నికల్లో గజ్వేల్ నుంచి గెల్చిన ఆయన ఈ సారి గజ్వేల్, కామారెడ్డి నుంచి బరిలో దిగనున్నారు. ప్రభుత్వం మీద తీవ్ర అసంతృప్తి ఉన్న నేపథ్యంలో కేసీఆర్కు సవాల్ విసరాలని ఈటెల రాజేందర్ బీజేపీ అభ్యర్థిగా గజ్వేల్ నుంచి పోటీ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రికి సవాల్ విసరాలని రేవంత్ రెడ్డి కామారెడ్డి బరిలో దిగనున్నారు.
ఇవాళ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి.. కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. రెండుచోట్ల నుంచి బరిలోకి దిగిన టీపీసీసీ చీఫ్.. ఈనెల 7న కొడంగల్లో నామినేషన్ వేశారు. తొలుత కొడంగల్ నుంచి పోటికి దిగిన రేవంత్.. కేసీఆర్ కామారెడ్డి నుంచి బరిలోకి దిగారని తెలిసి.. కామారెడ్డిలో పోటీకి దిగుతున్నట్లు ప్రకటించారు. కేసీఆర్పై పోటీకి రేవంతే సరైన వ్యక్తిగా భావించిన అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది.
నిన్న సీఎం కేసీఆర్ కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేశారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు రేవంత్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ అనంతరం కామారెడ్డిలో నిర్వహించనున్న బీసీ డిక్లరేషన్ సభలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అధికారంలోకి వస్తే బీసీలకు ఏం చేస్తామనే హామీలతో బీసీ డిక్లరేషన్ పెట్టినట్లు కాంగ్రెస్ పార్టీ నేతలు వెల్లడించారు. ఈ సభకు కాంగ్రెస్ ముఖ్యనేతలు హాజరు కానున్నట్లు తెలిపారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఈ సభలో పాల్గొని బీసీ డిక్లరేషన్ విడుదల చేస్తారని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
.
.
.