Secunderabad Station: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. దక్షిణ మధ్య రైల్వేకు హెడ్ క్వాటర్. ఆదాయంలో సూపర్. సదుపాయాల్లో నార్మల్. ఓ మోస్తారుగా ఉంటాయి లోపల వసతులు. బయటి నుంచి బిల్డింగ్ మాత్రం.. రాజరికం ఉట్టిపడేలా భలే బాగుంటుంది. ఇకపై సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇప్పటిలా ఉండదు. టోటల్ లుక్ మార్చేస్తున్నారు. అంతా హైటెక్ చేస్తున్నారు. రైల్వే స్టేషన్ను ఎయిర్పోర్టులా తీర్చిదిద్దనున్నారు. ఆ మేరకు కేంద్ర రైల్వే శాఖ పునరుద్దరణ పనులకు సిద్ధమైంది. ఆ రినొవేషన్ వర్క్ శనివారం ప్రధాని మోదీ శంకుస్థాపనతో ప్రారంభం.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు మూడేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే భూసార పరీక్షలు పూర్తి చేశారు. టికెట్ బుకింగ్ కౌంటర్, రైల్వే రక్షణ దళం కార్యాలయాలలను తరలించేందుకు వేరే భవనాల నిర్మాణం చేపట్టారు.
కొత్తగా చేపట్టే పనుల వివరాలు ఇవే..
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ రెండు వైపులా జీ+ 3 అంతస్తులతో 37,308 చ.మీ.ల వర్క్ ప్లేస్ అందుబాటులోకి రానుంది.
ప్లాట్ఫామ్ల పొడువు పెంచుతారు. ఒక్కో ప్లాట్ఫామ్ మీద 2 రైళ్లు ఆగుతాయి. రైల్ను రెండు వైపుల నుంచి ఎక్కడం, దిగడం వీలవుతుంది.
రెండో అంతస్తులో రూఫ్టాప్ ప్లాజా వాణిజ్య సముదాయం ఏర్పాటు చేస్తారు. విశాలమైన డబుల్ లెవెల్ రూఫ్ ప్లాజాతో పాటు రిటైల్ షాపులు, ఫుడ్ కోర్ట్స్, ఎంటర్టైన్మెంట్ ఫెసిలిటీస్ అందుబాటులోకి వస్తాయి.
7.5 మీటర్ల వెడల్పుతో రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, 26 లిఫ్టులు, 35 ఎస్కలేటర్లు ఉంటాయి.
స్టేషన్కు పవర్ సప్లై కోసం 5,000 kwp సోలార్ పవర్ప్లాంటును ఏర్పాటు చేయనున్నారు.
పచ్చదనం, పర్యావరణానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.
రైల్వే స్టేషన్ లోపలికి, బయటికి వెళ్లే మార్గాలు వేర్వేరుగా ఉంటాయి.
స్టేషన్కు నార్త్ సైడ్.. మల్టీ లెవెల్ పార్కింగ్.. సౌత్ సైడ్ అండర్ గ్రౌండ్ పార్కింగ్ ఏర్పాటు చేస్తారు.
ఈస్ట్, వెస్ట్ మెట్రోస్టేషన్లను స్కైవేతో అనుసంధానం చేయనున్నారు. సికింద్రాబాద్ ఈస్ట్కు, పాత గాంధీ ఆసుపత్రి మెట్రోస్టేషన్కు.. రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్గా వాక్వేలు ఉంటాయి. రేతిఫైల్ బస్టాండ్ను సైతం వాక్వేతో కనెక్ట్ చేస్తారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు, వందే భారత్ ఎక్స్ప్రెస్పై ప్రధాని మోదీ తెలుగులో ట్వీట్ చేశారు. “వందే భారత్ ఎక్స్ప్రెస్ ఆత్మగౌరవం, సౌకర్యం, అనుసంధానతలకి పర్యాయపదంగా మారింది. సికింద్రాబాద్, తిరుపతిల మధ్య ప్రవేశపెట్టిన ఈ రైలు పర్యాటకానికి, ముఖ్యంగా ఆధ్యాత్మిక పర్యాటకానికి విశేషప్రయోజనం చేకూరుస్తుంది. ఇది ఆర్థిక వృద్ధిని కూడా ఇనుమడింపజేస్తుంది. ఈ ముఖ్యమైన మౌలిక సదుపాయాల అప్గ్రేడేషన్ ప్రాజెక్ట్ ద్వారా అసంఖ్యాకమైన ప్రజానీకానికి ప్రయోజనం చేకూరుతుంది.” అంటూ ట్వీట్ చేస్తూ కొన్ని ఫోటోలను షేర్ చేశారు పీఎం మోదీ.
అంతా బాగానే ఉంది కానీ.. నైజాం-బ్రిటిషర్ల కాలం నాటి ఆ పాత భవనం రూపురేఖలు లేకుండా పోవడమే కాస్త బాధాకరం.