తెలంగాణ బీఆర్ఎస్లో అసంతృప్తి నేతల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలో పొలిటికల్ హీట్ మరింత కాకరేపుతోంది. అసంతృప్తిగా ఉన్న నేతలు బీఆర్ఎస్ అధిష్టానంపై రగిలిపోతున్నారు. నిరసన గళం వినిపిస్తున్నారు. అలాంటి నేతల తీరు సీఎం కేసీఆర్ కు తలనొప్పిగా మారింది.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా నేతలు బహిరంగంగానే తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇబ్రహీంపట్నంలో క్యామ మల్లేష్, ఎల్బీనగర్లో రామ్మోహన్ గౌడ్ అలకబూనారు. అలాగే ఉప్పల్ లో టిక్కెట్ పై ఆశలు పెంచుకున్న బొంతు రామ్మోహన్ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అధిష్టానం తీరుతో షాక్లో ఉన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి. మేడ్చల్లో మలిపెద్ది సుధీర్ రెడ్డికి మరోసారి మొండిచెయ్యి చూపింది బీఆర్ఎస్. ఆయన పార్టీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది.
మరోపక్క కూకట్పల్లి టిక్కెట్ తనకే ఇవ్వాలని పట్టుపడుతున్నారు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు. శేరిలింగంపల్లిలో సిట్టింగ్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అంతు చూస్తానంటున్నారు మరో నేత బండి రమేష్. జూబ్లీహిల్స్లో శ్రీధర్రెడ్డి, ఖైరతాబాద్లో మన్నే గోవర్ధన్ ఆశలు గల్లంతు కావడంతో వారు కూడా బీఆర్ఎస్ అధిష్టానం తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. మరోసారి రెబల్గా పోటీలో దిగే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.
అసంతృప్తి నేతల లిస్టులో రాజేంద్రనగర్ లో పటోళ్ల కార్తీక్ రెడ్డి, మహేశ్వరంలో తీగల కృష్ణారెడ్డి ఉన్నారు. మరి అలకబూనిన నేతలను బీఆర్ఎస్ అధిష్టానం బుజ్జగిస్తుందా ..? నామినేటెడ్ పదవులు ఆశ చూపుతుందా? మరి అసంతృప్తిగా ఉన్న నేతలందరూ అధిష్టానం ఇచ్చే ఆఫర్లకు తలొగ్గుతారా? లేదంటే రెబల్స్ గా ఎన్నికల బరిలోకి దిగుతారా..? పార్టీ మారతారా? ఈ అంశాలే ఇప్పుడు బీఆర్ఎస్ లో బిగ్ ఇష్యూగా మారాయి.