BRS sitting MLAs Defeat | అందరి కంటే ముందే అభ్యర్థులను ప్రకటించిన పార్టీ బీఆర్ఎస్. అలాంటి పార్టీకి ఈ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైంది. ఎందుకంటే.. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 58 మంది ఓటమి రుచిచూశారు. ఇక ఐదుగురు సిట్టింగ్లు మాత్రం.. మూడో స్థానానికే పరిమితమైపోయారు. అటు ఆనాడూ పార్టీ ఫిరాయించిన వారికి ఓటర్లు కర్రు కాల్చి వాతపెట్టారు.
BRS sitting MLAs Defeat | అందరి కంటే ముందే అభ్యర్థులను ప్రకటించిన పార్టీ బీఆర్ఎస్. అలాంటి పార్టీకి ఈ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైంది. ఎందుకంటే.. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 58 మంది ఓటమి రుచిచూశారు. ఇక ఐదుగురు సిట్టింగ్లు మాత్రం.. మూడో స్థానానికే పరిమితమైపోయారు. అటు ఆనాడూ పార్టీ ఫిరాయించిన వారికి ఓటర్లు కర్రు కాల్చి వాతపెట్టారు.
ఎన్నికలు అనగానే.. ఓటర్లను నాయకులు వారి స్వలాభం కోసం పక్కదారి పట్టించాలని చూస్తారు. అలా ఒకసారి జరగవచ్చు .. రెండోసారి.. కూడా జరగొచ్చు. కానీ ప్రతిసారీ నాయకులే గెలవరు.. అప్పుడప్పుడు ప్రజలు కూడా విజయానాధం చేస్తారు. ఇది ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ఓటర్లు ఇచ్చిన తీర్పును పరిశీలిస్తే అర్థమవుతుంది. తెలంగాణలో అధికార బీఆర్ఎస్ను ఎదుర్కొని తెలంగాణ ఇచ్చిన పార్టీగా తొలిసారిగా జయకేతనం ఎగిరేసింది కాంగ్రెస్. అయితే ఈ విజయం ఏకపక్షంగా సాగలేదు. అధికార బీఆర్ఎస్ అంత సులభంగా కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని ఇవ్వలేదు. ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో కాంగ్రెస్ గాలి బలంగా వీచింది. కానీ కాంగ్రెస్ గెలిచిన సీట్లలో ఇవి ప్రత్యేకంగా నిలుస్తాయి.
అది మునుగోడు బైపోల్ టైం. గుర్తుంది కదా అప్పుడు జరిగిన మొయినాబాద్ ఫామ్ హౌజ్ తతంగం. అప్పుడు మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గెలిచే సూచనలు ఉండడంతో కేసీఆర్ సరికొత్త నాటకానికి తెరలేపారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఎమ్మెల్యేలు గువ్వల, రేగా కాంతారావు, పైలట్ రోహిత్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి ని కొనుగోలు చేసేందుకు కొంతమంది స్వామీజీలు బేరానికి వచ్చారని, వారంతా కూడా బీజేపీకి చెందిన వారని అప్పట్లో ప్రచారం జరిగింది. దీనిని సాకుగా చూపిస్తూ కేసీఆర్ సెంటిమెంట్ ఎగదోసే ప్రయత్నం చేశారని అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలోనూ కేసీఆర్ ఇదే ప్రధాన అంశంగా విమర్శలు చేశారు. అది జనాల్లో బాగా క్లిక్ అవడంతో మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఆ తర్వాత ఆ కేస్ కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్లింది. ఇదంతా ఇప్పుడెందుకు అనుకుంటున్నారా..? ఎందుకంటే ఆ ఎపిసోడ్లో ఉన్ననలుగురు ఎమ్మెల్యేలు బాలరాజు, హర్షవర్ధన్ రెడ్డి, రోహిత్ రెడ్డి, కాంతారావు.. ఇప్పుడు చిత్తుగా ఓడిపోయారు. వాళ్లంతా కాంగ్రెస్ అభ్యర్థుల చేతుల్లోనే ఓటమిపాలవ్వడం ఇక్కడ గమనించాల్సిన అంశం. ప్రస్తుతం వారి ఓటమి పట్ల సానుభూతి కంటే ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తం కావడం విశేషం. నాడు మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఏమీ జరగకపోయినప్పటికీ కొనుగోలు నాటకానికి తెరలేపారని.. ఇప్పుడు నిజంగానే ఆ నాటకంలో పావులై ఓడిపోయారని సోషల్ మీడియాలో ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి.
తెలంగాణ ఓటర్లు విజ్ఞులు. ఈ మాటను కేసీఆర్ తరుచుగా చెప్పడం మనం విన్నాం. ఎన్నిక ఏదైనా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కేసీఆర్ అలాంటి పదాలను మధ్యలో వాడుతారు. అయితే ఇప్పుడు ఇచ్చిన ఎన్నికల ఫలితాలను నిశీతంగా పరిశీలిస్తే.. అనుకున్నట్టుగానే తెలంగాణ ఓటర్లు కర్రకాల్చి వాత పెట్టారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ గుర్తుపై గెలిచి అధికార పార్టీ కండువా కప్పుకున్న వారిని ఆయా నియోజకవర్గ ఓటర్లు దిమ్మతిరిగే తీర్పునిచ్చారు.
ఇల్లందులో హరిప్రియానాయక్ పై కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య గెలిచారు. గెలుపు అంటే మాములు గెలుపు కాదనే చెప్పుకోవాలి. హరిప్రియనాయక్కు 51వేల862 ఓట్లు పోల్ అయితే.. కోరం కనకయ్యకు ఏకంగా ఒక లక్ష9వేల171 ఓట్లు పడ్డాయి. అంటే 57వేల 309 ఓట్ల మెజార్టీ ఇచ్చారు. దీన్ని బట్టే అర్థం చేసుకోవాలి పార్టీ పిరాయించిన నేతలకు ఓటర్లు ఎలా బుద్ధి చెప్పారో. అదే జిల్లాలోని పినపాక నుంచి రేగ కాంతారావు 2018లో కాంగ్రెస్ గుర్తుపై గెలిచి బీఆర్ఎస్లో చేరారు. అయితే ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో రేగా కాంతారావును..చిత్తుచిత్తుగా ఓడించారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పాయం వెంకటేశ్వర్లును.. 34506 ఓట్ల మెజార్టీ ఇచ్చి.. కాంతారావును ఇంటికి పంపించారు. పాలేరు. ఈ సెగ్మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ నుంచి పొంగులేటి పోటీ చేయడంతో ఈ స్థానంపై అందరికీ ఆసక్తి నెలకొంది. అయితే 2018లో కందాల ఉపేందర్ రెడ్డి హస్తం గుర్తుపై గెలిచి.. ఆ తర్వాత కారెక్కారు. దీంతో ఆయనకు కూడా పాలేరు ఓటర్లు ఈ సారి మూతోడ్ జవాబిచ్చారు. పొంగులేటికి ఏకంగా 56వేల 650 ఓట్ల మెజార్టీ ఇచ్చి కందాలను పెవిలియన్కు పంపించారు. కొత్తగూడెంలోనూ వనమా వెంకటేశ్వరరావును.. అక్కడి ఓటర్లు వద్దు అనుకున్నారు. కాంగ్రెస్ బలపర్చిన సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు భారీ మెజార్టీతో గెలుపొందారు. వనమా 2018లో గెలిచిన తర్వాత అధికార పార్టీలో చేరారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి పోటీచేశారు. వనమాకు అపోనెంట్ గా నిల్చుకున్న కూనంనేని సాంబశివరావును 26వేల 547 ఓట్ల మెజార్టీతో గెలిపించారు. దీంతో వనమాను కూడా ఓటర్లు బార్డర్ దాటే వరకు తరిమికొట్టిన పరిస్థితి ఉంది.
నకిరేకల్లో చిరుమర్తి లింగయ్య గత ఎన్నికల్లో కాంగ్రెస్ గుర్తుపై గెలిచి.. బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు అదే లింగయ్య.. కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశం చేతిలో ఓటమిపాలయ్యారు. 68వేల839 ఓట్ల మెజార్టీతో చిరుమర్తి లింగయ్యకు అక్కడి ఓటర్లు గుడ్బై చెప్పారు. ఎల్లారెడ్డిలో జాజుల సురేందర్ ను.. కాంగ్రెస్ క్యాండిడేట్ మదన్ మోహన్ రావు ఓడించారు. 24వేల ఓట్ల మెజార్టీతో జాజులను ఇంటికే పరిమితం అయ్యేలా చేశారు ఎల్లారెడ్డి ఓటర్లు.
కొల్లాపూర్లో 2018లో కాంగ్రెస్ గుర్తుపై గెలిచిన బీరం హర్షవర్దన్ రెడ్డి ఇప్పుడు అధికార బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు చేతిలో 29వేల 931 ఓట్ల తేడాతో ఓటమి రుచిచూశారు.
తాండూరు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పైలట్ రోహిత్ రెడ్డిని.. కాంగ్రెస్ అభ్యర్థి బయ్యని మనోహర్ రెడ్డి ఇంటికి పంపించాడు. 2018లో కాంగ్రెస్ సింబల్పై పోటీచేసి విజయం సాధించిన రోహిత్ రెడ్డి బీఆర్ఎస్లో చేరారు. ఇప్పుడు ఆయనకు కూడా తాండూరు ఓటర్లు బుద్ది చెప్పారని టాక్ వినిపిస్తోంది. ఇక భూపాలపల్లిలో గండ్ర వెంకటరమణారెడ్డి ఓటమిపాలయ్యారు. కాంగ్రెస్ క్యాండిడేట్ గండ్ర సత్యనారాయణకే అక్కడి ప్రజలు పట్టం కట్టారు. దీంతో 2018లో కాంగ్రెస్ టికెట్ తీసుకుని గెలిచిన గండ్ర వెంకటరమణారెడ్డి.. ఆ తర్వాత కేసీఆర్ పార్టీలో చేరిపోయారు. ఇప్పుడు జనాలు మాత్రం గండ్ర సత్యనారాయణకు..52వేల 699 ఓట్ల మెజార్టీ ఇచ్చి విజయతిలకం దిద్దారు.
కేసీఆర్ కేబినెట్లో కీలకంగా ఉన్న మంత్రులకు సైతం తెలంగాణ ఓటర్లు పక్కకు జరిపారు. కేసీఆర్ సహా 18 మంది మంత్రులు ఉండగా, ఇందులో ముగ్గురు మంత్రులు ఎన్నికల్లో పోటీ చేయలేదు. మిగిలిన 15 మందిలో ఆరుగురు ఓడిపోయారు. అందులో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఒకరు శ్రీనివాస్గౌడ్, మరొకరు నిరంజన్ రెడ్డి. ఇక ఖమ్మం జిల్లాకు చెందిన పువ్వాడ అజయ్ కుమార్, వరంగల్ నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావు, కరీంనగర్ జిల్లా నుంచి కొప్పుల ఈశ్వర్, ఆదిలాబాద్ నుంచి ఇంద్రకరణ్ రెడ్డి ఉన్నారు. మహబూబ్నగర్లో కాంగ్రెస్ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్రెడ్డి, శ్రీనివాస్గౌడ్ను 18,738 ఓట్ల తేడాతో ఓడించారు. వనపర్తిలో 25,320 ఓట్లతో కాంగ్రెస్ క్యాండిడేట్ మేఘా రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్రెడ్డిని ఓడించారు. పాలకుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి, రాజకీయాల్లో 30 ఏండ్లకుపైగా అనుభవమున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును సుమారు 40 వేల ఓట్ల తేడాతో ఓడించారు. మంత్రి ఇంద్రకరణ్రెడ్డిపై బీజేపీ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్రెడ్డి 50,703 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఖమ్మం నుంచి పోటీ చేసిన తుమ్మల నాగేశ్వర్రావు.. మంత్రి పువ్వాడ అజయ్కుమార్ను సుమారు 41,664 ఓట్ల తేడాతో చిత్తుగా ఓడించారు. ధర్మపురిలో మంత్రి కొప్పుల ఈశ్వర్ను, కాంగ్రెస్ లీడర్ అడ్లూరి లక్ష్మణ్ సుమారు 22,039 ఓట్ల మెజార్టీతో ఓడించారు. గత ఎన్నికల్లో 441 ఓట్ల స్వల్ప మెజార్టీతో గట్టెక్కిన కొప్పుల, ఈసారి ఏకంగా భారీ ఓట్ల తేడాతో ఓటమిని మూటగట్టుకున్నారు.
కొందరు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎందుకంటే వారు పోటీ చేసి కనీసం రన్నరప్గానైన నిలవలేకపోయారు. దాదాపుగా ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మూడు, నాలుగుస్థానాల్లో నిలిచారు.
కల్వకుర్తి, మంచిర్యాల, వరంగల్ ఈస్ట్, కొత్తగూడెం, ఆర్మూర్ నియోజకవర్గాల నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉండి కారు గుర్తుపై పోటీ చేసి వీరంతా ఓడిపోయారు.
ఆర్మూర్లో అంతా తానే అని చెప్పుకునే వ్యక్తి జీవన్రెడ్డి. అంతేకాదు కేటీఆర్ కు బినామీ ఉంటారని ప్రచారం కూడా ఉంది. అలాంటి వ్యక్తికే ఈ సారి దారుణమైన ఓటమి ఎదురైంది. పోటీ కూడా ఇవ్వలేకపోయాడంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆర్మూర్లో బీజేపీ అభ్యర్థి రాకేష్ రెడ్డి 29వేల 669 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సెకండ్ ప్లేస్లో కాంగ్రెస్ అభ్యర్థి వినయ్ రెడ్డి ఉండగా.. జీవన్ రెడ్డి మూడో స్థానంలోనే ఆగిపోయారు. మంచిర్యాల నియోజకవర్గంలో 2018లో నడిపల్లి దివాకర్ రావు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ సారి కూడా కేసీఆర్ ఆయనకే టికెట్ ఇచ్చారు. అయితే మంచిర్యాల ఓటర్లు మాత్రం మార్పు కోరుకున్నారు. అందుకే కాంగ్రెస్ అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావును దాదాపుగా 66వేల 116 ఓట్ల తేడాతో గెలిపించారు. అయితే ఇక్కడ రన్నరప్గా నిలిచింది మాత్రం బీజేపీ అభ్యర్థి రఘునాథ్. ఆయనకు 39వేల 829 ఓట్లు పడ్డాయి. మూడో స్థానంలో బీఆర్ఎస్ క్యాండిడేట్ దివాకర్ రావు.. 37వేల989 ఓట్లను దక్కించుకున్నారు. అంటే వీరిపై ఎంతలా వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇక కల్వకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి గెలుపొందారు. ఇక్కడ కూడా సెకండ్ ప్లేస్లో బీఆర్ఎస్ లేదు. బీజేపీ అభ్యర్థి తల్లోజు ఆచారి రన్నరప్గా ఉండగా.. మూడో స్థానంలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఉన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ ఓటర్లు కాంగ్రెస్కే పట్టం కట్టారు. కొండా సురేఖ తన ప్రత్యర్థి ప్రదీప్ కుమార్ పై 15వేల 652 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక మూడో స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నన్నపునేని నరేందర్ ఉన్నారు. ఇక కొత్తగూడెంలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా పోటీ చేసినా వనమా నాగేశ్వర్ రావు.. ఈ సారి మూడో స్థానానికే పరిమితమయ్యాడు. సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు.. తన ప్రత్యర్థిగా ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ నుంచి పోటీ చేసిన జలగం వెంకట్రావుపై 26వేల 547 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. వనమాకు 37వేల 555 ఓట్లు మాత్రమే పోల్ కావడంతో మూడో స్థానంలోనే ఉండిపోయారు.
58 మంది సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఉండి ఓటమిపాలయ్యారు. అంటే కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజల్లో ఎంతలా వ్యతిరేకత ఉందో ఇట్టే తెలుస్తుంది. కార్వాన్, నాంపల్లి నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ క్యాండిడేట్లు మూడో స్థానంలో ఉండిపోయారు. ప్రత్యేకించి కొన్ని స్థానాల్లో గులాబీ క్యాండిడేట్స్ నాలుగో స్థానంలో ఉన్నారు. యాకత్ పురలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన సామ సుందర్ రెడ్డికి 15వేల 516 ఓట్లు దక్కాయి. ఆయన నాలుగో స్థానంలో నిలిచిపోయారు. చార్మినార్ నియోజకవర్గంలోనూ బీఆర్ఎస్ అభ్యర్థి సలావుద్దీన్.. ఫోర్త్ ప్లేస్లోనే ఆగిపోయారు. అధికారం ఉంది కదా అని అనుకుంటే అంతకు మించిన పవర్ ఓటర్ల చేతిలో ఉంటుంది. ఈ పిక్చర్ నాయకులకు బాగానే అర్థమై ఉంటుంది. కేవలం తెలంగాణ అని కాదు.. ఏ రాష్ట్రంలోనైనా పవర్ లో ఉన్నాం.. పర్ఫామెన్స్ ఇస్తాం అంటే ఇలాగే బొమ్మ ఉల్టా అయిపోతుంది అన్నది ఇక్కడ నీతి.