KCR: ఎన్నికలు వస్తేగానీ ప్రజల ముందుకురారు కేసీఆర్. అలాంటిది.. ఇప్పట్లో ఎలాంటి ఎలక్షన్లు లేకున్నా.. వరుస సభలకు సమాయత్తమవుతున్నారు గులాబీ బాస్. డిసెంబర్ 4న మహబూబ్ నగర్, డిసెంబర్ 7న జగిత్యాల, ఆ తర్వాత మహబూబాబాద్. ప్రస్తుతానికి ఈ మూడు సభలు కన్ఫామ్ అయ్యాయి. త్వరలోనే మరిన్ని ప్రాంతాల్లో మరిన్ని సభలు ఉంటాయని తెలుస్తోంది. జగిత్యాల సభకు.. కవితను ఇంఛార్జ్ గా నియమించడంతో ఈ మీటింగ్స్ కు కేసీఆర్ ఎంత ప్రయారిటీ ఇస్తున్నారో అర్థమవుతోంది.
ఎందుకు? సడెన్ గా ఈ బహిరంగ సభలు ఎందుకు? అనేదే ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇంకెందుకు కేంద్రంపై, బీజేపీపై విరుచుకుపడేటందుకే అనేది కామన్ ఆన్సర్. ఇటు ఫాంహౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, అటు మంత్రులపై ఐటీ, ఈడీ దాడులతో తెలంగాణలో రాజకీయ సెగ రగులుతోంది. తమ పార్టీనే దెబ్బకొట్టాలని బీజేపీ చూడటం.. తమ నేతల్లో భయం కలిగేలా మంత్రులపై జాతీయ దర్యాప్తు సంస్థల దాడులు జరుగుతుండటాన్ని కేసీఆర్ సహించలేకపోతున్నారని తెలుస్తోంది. అటు, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రం భారీగా కోత వేసి ఆర్థికంగా తమ చేతులు కట్టివేసిందని మండిపడుతున్నారు. ఈ విషయాలన్నీ ప్రజలకు వివరించి చెప్పడానికే ఈ సభలు అంటున్నారు. బీజేపీ, కేంద్రం కుట్రలపై వరుస సభలతో కేసీఆర్ శివాలెత్తబోతున్నారని చెబుతున్నారు.
అయితే, పైస్థాయి రాజకీయ వర్గాల్లో మరో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కేంద్రాన్ని, బీజేపీని బద్నామ్ చేయాలంటే ఏ ప్రెస్ మీటో పెడితే సరిపోతుంది. ఎలాగూ అసెంబ్లీ సెషన్ కూడా ఉంది. మరి, సడెన్ గా ఈ బహిరంగ సభలు ఎందుకు? అంటే.. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు రెడీ అవుతున్నారని టాక్. అందుకే, ఈ సభలంటూ.. ఎన్నికల ప్రిపరేషన్ కోసమేనంటూ.. వాదన వినిపిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలతో కలిసి తెలంగాణ ఎలక్షన్ జరిగేలా ముందస్తుకు వెళ్లబోతున్నారని అంటున్నారు. ఆ ప్రచారంలో నిజం ఉందని.. అందుకే ఇప్పుడిలా సడెన్ గా వరుస బహిరంగ సభలను కేసీఆర్ ప్రకటించారని అంచనా వేస్తున్నారు.
అంతఈజీగా ప్రజల ముందుకు రాని కేసీఆర్.. సడెన్ గా ఇలా ప్రజలు గుర్తుకొచ్చి.. సభలు పెడుతుండటం వెనుక అసెంబ్లీ రద్దు వ్యూహమే ఉందంటున్నారు. ప్రతిపక్షాలకు ఏమాత్రం టైమ్ ఇవ్వకుండా.. టీఆర్ఎస్ దే అప్పర్ హ్యాండ్ అయ్యేలా.. ఎత్తులు వేయడంలో గులాబీ బాస్ సిద్ధహస్తుడు. గత ఎన్నికల్లో అలానే చేశారు. ఈసారి ముందస్తు ఉండబోదంటూ కేసీఆర్ పదే పదే చెప్పినా.. తాజా రాజకీయ పరిణామాలతో ప్లాన్ మార్చేశారని అంటున్నారు.
ఫాంహౌజ్ కేసు తర్వాత.. బీజేపీ ఇంకా చాలామంది ఎమ్మెల్యేలకు వల విసిరిన విషయం గుర్తించారు. పలువురు నేతలు పార్టీ మార్పుకు సై అన్నట్టు కూడా కేసీఆర్ దృష్టికి వచ్చింది. ఇక, మంత్రులు గంగుల కమలాకర్, మల్లారెడ్డి, తలసాని బ్రదర్స్ లపై ఈడీ, ఐటీ పంజా విసిరిని తీరు చూస్తుంటే.. గులాబీ నేతల్లో భయం మొదలైంది. కేసీఆర్ తో ఉంటే తమ ఆర్థిక మూలాలు దెబ్బతింటాయనే జాగ్రత్తతో.. అడిగితే చాలు కాషాయ కండువా కప్పేసుకునేందుకు పలువురు కీలక నేతలు మానసికంగా సిద్దమైపోయారని తెలుస్తోంది. ముందుముందు మరిన్ని దాడులు జరిగితే.. ఢిల్లీ లిక్కర్ స్కాం కవిత మెడకు చుట్టుకుంటే.. ఇక పార్టీ నుంచి వలసలను తాను సైతం ఆపలేననే నిర్ణయానికి కేసీఆర్ వచ్చారని టాక్. అందుకే, ఎందుకైనా మంచిదనే భావనలో.. మరో ఏడాది వరకూ ఆగకుండా.. ఈ ఫిబ్రవరిలోనే అసెంబ్లీ రద్దు చేసేసి.. ఎన్నికలకు వెళ్లాలనేది కేటీఆర్ ప్లాన్ అంటున్నారు. అందుకే వరుస బహిరంగ సభలు పెడుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఏమో గుర్రం ఎగరావచ్చు…