Reasons Behind Gap Between kcr and And YS Jagan: మాజీ సీఎంలు కేసీఆర్, జగన్.. వారి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి జగన్ సీఎం అవుతారని కేసీఆర్ జోస్యాలు చెప్తూనే ఉన్నారు. మొన్నిటి ఎన్నికల్లో తాను పరాజయం పాలైనప్పటికీ.. ఏపీలో మాత్రం మళ్లీ జగన్ సీఎం అవుతున్నారని చెప్పుకొచ్చారు. అలాంటి రహస్య ఆప్తమిత్రుల మధ్య ఇప్పుడు గ్యాప్ పెరిగినట్లు కనిపిస్తుంది. అసలు ఢిల్లీలో జగన్ నిర్వహించిన ధర్నాకు బీఆర్ఎస్ మద్దతు పలకపోవడం వెనుక లెక్కలేంటి? బీజేపీకి దగ్గరవ్వాలన్న ఉద్దేశంతోనే జగన్ని కేసీఆర్ దూరం పెడుతున్నారా?
అధికారం శాశ్వతంగా తమదే అన్న ధీమాతో తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్ ఇష్టారాజ్యంగా పాలించారు. తెలంగాణ సెంటిమెంట్ను అడ్డంపెట్టుకుని కేసీఆర్ రెండు సార్లు, ఒక్క ఛాన్స్ అంటూ జగన్ ఒకసారి అధికారం చెలాయించారు. వారి వైఖరితో విసిగి వేసారిపోయిన ప్రజలు మొన్నటి ఎన్నికల్లో గట్టిగానే బుద్ధి చెప్పారు. వైసీపీకి అయితే ప్రతిపక్షహోదా కూడా లేకుండా చేశారు.
మాజీలైపోయిన ఆ ఇద్దరి మధ్య ముందునుంచి సాన్నిహిత్యం ఉంది. 2014 ఎన్నికల పోలింగ్ ముగియగానే తెలంగాణలో తాను, ఏపీలో జగన్ ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టబోతున్నామని ఘనంగా ప్రకటించారు కేసీఆర్.. ఆ జోస్యం వికటించింది. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ విజయానికి కేసీఆర్ అన్ని రకాలుగా సహకరించారన్న ప్రచారం ఉంది. ఇక మొన్నటి ఎన్నికల్లో పరాజయం పాలైన కేసీఆర్ ఏపీలో జగన్ గెలుస్తారని ప్రకటించారు. అయితే కేసీఆర్ కంటే దారుణంగా జగన్ ఓటమి పాలయ్యారు.
జగన్ ఓటమికి కారణాల్లో ఒకటైన మూడు రాజధానుల నిర్ణయాన్ని కూడా కేసీఆర్ సమర్థించారు. ముఖ్యమంత్రిగా జగన్ ప్రగతిభవన్కు వెళ్లి కేసీఆర్తో రహస్య మంతనాలు సాగించిన సందర్భాలున్నాయి. ఇక కేసీఆర్ ఓటమి తర్వాత తుంటి చికిత్స చేయించుకున్నప్పుడు సీఎం హోదాలో జగన్ ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించి వచ్చారు. ఇప్పుడు ఆ ఇద్దరు ఓటమిని జీర్ణించుకోలేక పోతున్నారు. అసెంబ్లీకి ముఖం చాటేస్తున్నారు.
గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్ అధికారం కోల్పోయాక అసెంబ్లీకి ఒక్కసారే హాజరయ్యారు. బడ్జెట్ రోజున సెషన్స్కు అటెండ్ అయిన మళ్లీ ఫాంహౌస్కే పరిమితమయ్యారు. అసెంబ్లీ సమావేశాలకు 60 రోజుల పట హాజరుకాకపోతే శాసన సభ్యత్వం రద్దవుతుందన్న భయంతోనే ఆయన అసెంబ్లీలో గెస్ట్ అపిరీయన్స్ ఇచ్చి వెళ్లిపోయారంటున్నారు. మరోవైపు జగన్ కూడా పులివెందుల ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసి వెళ్లాక ఒక్క సారే సభకు హాజరయ్యారు. అదికూడా తన ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసి ఎవరూ పట్టించుకోకపోవడంతో వెళ్లి పోయారు.
వలసలతో సతమతమవుతున్న కేసీఆర్ సొంత ఎమ్మెల్యేలను కాపాడుకోలేక ఫాంహౌస్కు పరిమితం అవుతుంటే … జగన్ మాట్లాడితే బెంగళూరు ప్యాలెస్కు వెళ్లిపోతున్నారు. అసెంబ్లీకి డుమ్మాకొట్టిన ఆయన ప్రస్తుతం మూడో సారి సతీసమేతంగా బెంగళూరు వెళ్లారు. వినుకొండలో హతుడి కుటుంబం పరామర్శ అని బెంగళూరు నుంచి హడావుడిగా వచ్చిన జగన్.. ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని అటు అసెంబ్లీలో ఇటు ఢిల్లీల హడావుడి చేసి మళ్లీ బెంగళూరు వెళ్లిపోయారు.
Also Read: రెండో విడత రుణమాఫీకి ఏర్పాట్లు.. రేపే రైతుల ఖాతాల్లో నగదు జమ!
రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ ఢిల్లీలో ధర్నా చేసిన జగన్.. మంగళ, బుధవారాల్లో ఢిల్లీలో ఉన్నా ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్షా అపాయింట్మెంట్ దొరకలేదు . బీజేపీ నేతలెవరూ జగన్ను కలవడానికి ఇష్టపడలేదు. దీంతో ఆయన నిరాశతో తిరిగొచ్చిన ఆయన అసెంబ్లీ సమావేశాలు చివరిరోజున కూడా హాజరుకాకుండానే బెంగళూరు వెళ్లిపోయారు. దాంతో జగన్ ఇక అసెంబ్లీ వచ్చే పరిస్ధితి లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
అదలా ఉంటే రెండు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రుల మధ్య స్నేహబంధం బెడిసికొట్టినట్లు కనిపిస్తుంది. జగన్ ఢిల్లీ ధర్నాకు బీఆర్ఎస్ మద్దతు లభించలేదు. లోక్సభలో జీరో అయిపోయిన బీఆర్ఎస్కు నలుగురు రాజ్యసభ సభ్యులున్నా వారేవరు జగన్ ధర్నా శిబిరంలో కనిపించలేదు. బీజేపీకి దగ్గరవ్వాలన్న ఉద్దేశంతోనే కేసీఆర్ వైసీపీని దూరం పెట్టారన్న టాక్ వినిపిస్తుంది. ఏపీలో ఎన్డీఏ సర్కారును జగన్ టార్గెట్ చేస్తుండటంతో ఎందుకొచ్చిన తంటాలే అని బీఆర్ఎస్ నోరు మెదపలేదంటున్నారు.
ఇటు చూస్తే కేసీఆర్ ఒక వైపు ఎమ్మెల్యేలు చేజారిపోతూ మరోవైపు విద్యుత్తు కొనుగోలు, ప్రాజెక్టుల్లో అక్రమాలపై విచారణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇక ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో జైలు జీవితం గడుపుతున్నారు. ఆమెకు బెయిల్ దొరకాలన్నా, తనపై విచారణలకు సంబంధించి ఎలాంటి చర్యలు లేకుండా బయటపడాలన్నా కేంద్రం అండదండలు అవసరమని కేసీఆర్ భావస్తున్నట్లు కనిపిస్తున్నారు. అందుకే ఆయన బీజేపీతో మైత్రి కోసం జగన్కి దూరమవుతున్నారంటున్నారు.
అందులో భాగంగానే అసెంబ్లీలో ఒక్కరోజు మెరుపుతీగలా మెరిసిన కేసీఆర్ మీడియా ముందుకొచ్చి రాష్ట్ర బడ్జెట్ను విమర్శించి వెళ్లిపోయారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగినా పదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అసలు కేంద్ర బడ్జెట్ ఊసే ఎత్తలేదు. మళ్లీ ఫాంహౌస్కి పోయి రిఫ్రెష్ అవుతున్న కేసీఆర్ మళ్లీ అసెంబ్లీలో ఎప్పుడు ఎంట్రీ ఇస్తారో ఆయన పార్టీ వారే చెప్పలేకపోతున్నారు. ఇక జగన్ సంగతి సరేసరి. మొత్తమ్మీద ఇద్దరు రహస్య మిత్రుల బంధం ఇప్పుడు తెగిపోయినట్లే కనిపిస్తుంది.