ED: అర్థరాత్రి ఆకస్మికంగా బదిలీలు. ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్-ఈడీ హైదరాబాద్ జోనల్ ఆఫీసులో జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారి దినేష్ పరుచూరిని బదిలీ చేసింది కేంద్రం. ఆయన స్థానంలో రోహిత్ ఆనంద్ ను నియమించింది. దేశవ్యాప్తంగా 36 మందిని బదిలీ చేసినా.. హైదరాబాద్ జోన్ ను సాధారణ బదిలీగా చూడలేమంటున్నారు. తెలంగాణలో ఈడీ కేసులు సంచలనంగా మారిన నేపథ్యంలో ఏకంగా జేడీ స్థాయి అధికారిని ఇక్కడి నుంచి పంపించేయడం వెనుక రాజకీయ కోణం ఉండొచ్చని చెబుతున్నారు. వరుస కేసులతో ఈడీ దూకుడు మీదుందిగా.. అయినా బదిలీ ఏంటి?
ఇది చాలదు. అంతకుమించి కావాలని కేంద్రం కోరుకుంటోందనే వాదన వినిపిస్తోంది. కేసినో కేసులో చీకోటి ప్రవీణ్ కేంద్రంగా పలువురు రాజకీయ ప్రముఖులకు కేసు బిగించాలని భావించినా.. ఇంకా వారి వరకు కేసు దర్యాప్తును తీసుకురాలేకపోయారనే అసంతృప్తి ఉన్నతాధికారులు వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
ఇక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కేసు విషయంలో ఈడీ బాగా అబాసుపాలైంది. రోహిత్ రెడ్డినే తిరిగి ఈడీని ప్రశ్నించే స్థాయికి పడిపోయింది. ఏ కేసు పెట్టారో మొదట్లో క్లారిటీనే లేదు. ఇచ్చింది కూడా మామూలు నోటీసులే. అందులో పస లేదని రోహిత్ రెడ్డినే ఎద్దేవా చేశారంటే.. అందుకు ఈడీ ఫెయిల్యూరే కారణమని జేడీపై హైయ్యర్ ఆఫీసర్స్ కన్నెర్ర జేసినట్టు సమాచారం. మొదటిరోజు విచారణ సాదాసీదాగా జరిగిందంటూ.. తనపై ఏ కేసు పెట్టారో చెప్పమంటే ఈడీ అధికారులు చెప్పలేకపోయారంటూ రోహిత్ రెడ్డి మీడియా ముందు చెప్పడంతో ఈడీ కావాలనే కుట్ర చేసిందనే మెుసేజ్ ప్రజల్లోకి వెళ్లిపోయింది. ఇటీవల టాక్ ఆఫ్ ది తెలంగాణగా మారిన పైలట్ రోహిత్ రెడ్డి కేసు విషయంలో దర్యాప్తు అధికారులు మరీ ఇంత ఉదాసీనంగా ఉండటం వల్లే.. హైదరాబాద్ జేడీపై బదిలీ వేటు పడిందనే చర్చ ఢిల్లీ వర్గాల్లో జరుగుతోంది.