Revanth Reddy: అప్పుడప్పుడు చిన్న విషయాలే పెద్దవి అవుతాయి. సరైన సమయంలో సరైన ఆరోపణ చేస్తే.. అది లోతుగా ప్రభావం చూపుతుంది. కాంగ్రెస్ లో ఇప్పుడదే జరుగుతోంది. అసలే, కమిటీల్లో తమకు ప్రాధాన్యం దక్కలేదని, తమ వారికి పదవులు రాలేదని.. తీవ్ర అసంతృప్తితో ఉన్న సీనియర్లకు రెండు విషయాలు పెద్ద షాక్ ఇచ్చాయి. వాళ్లంతా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తిరగబడేలా చేశాయి. ఇంతకీ ఆ రెండు అంశాలు ఏంటంటే.. ఒకటి తీన్మార్ మల్లన్న చేసిన ఆరోపణ, ఇంకోటి సీపీ సీవీ ఆనంద్ చెప్పిన మాట. ఈ రెండూ కాంగ్రెస్ సీనియర్లంతా రేవంత్ రెడ్డిపై తిరుగుబాటు చేసేలా ప్రేరేపించాయని తెలుస్తోంది.
భట్టి ఇంట్లో సీనియర్లు భేటీ అయ్యారు. వాళ్లంతా దాదాపు ఒకేరకమైన ఆరోపణలు చేశారు. తాము కోవర్టులమంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఏడాదిన్నరగా తమపై కుట్ర జరుగుతోందని.. బలమైన నాయకులను బలహీన పరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లూ భరించిన వాళ్లంతా.. లేటెస్ట్ గా తీన్మార్ మల్లన్న పెట్టిన పోస్టు వాళ్లలో ఉక్రోశం తీసుకొచ్చింది. ఇంతటి తెగింపునకు పరోక్షంగా కారణమైంది.
భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, జగ్గారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు టీఆర్ఎస్ కోవర్టులని తీన్మార్ మల్లన్నతో ఎవరు పోస్టింగ్ పెట్టించారంటూ సీనియర్లు నిలదీశారు. తీన్మార్ మల్లన్న ఏ పార్టీ వ్యక్తి అని, ఆయనకు డబ్బులు ఇచ్చి ఈ పోస్టింగ్లు ఎవరు పెట్టించారని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో తమపై తప్పుడు ప్రచారాలు జరుగుతున్నా వలస నాయకుడు కనీసం ఖండించడం లేదని మండిపడ్డారు. తామంతా పార్టీని, కాంగ్రెస్ను నాశనం చేస్తే.. నాలుగు పార్టీలు మారి వచ్చిన వ్యక్తి పార్టీని ఉద్దరిస్తాడా? అని ప్రశ్నించారు. కమిటీల్లో వలస వచ్చిన నేతలకు పదవులు ఇవ్వడం ఒరిజినల్ నేతలను బాధిస్తున్నదని, అసలైన నేతలపై కోవర్టుల ముద్ర వేస్తున్నారన్నారు. క్యారెక్టర్ లేనివాళ్లు పార్టీని నడిపిస్తున్నారని, తమను ప్రశ్నించే స్థాయి వారికి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తీన్మార్ మల్లన్న పెట్టిన పోస్టు ఇంత కలకలం రేపుతుందని బహుషా ఆయన కూడా ఊహించి ఉండరు. సీనియర్లు ఎక్కడా రేవంత్ రెడ్డి పేరు నేరుగా ప్రస్తావించకున్నా.. వారి అనుమానమంతా ఆయన మీదనే. రేవంతే.. మల్లన్నకు డబ్బులిచ్చి.. తాము టీఆర్ఎస్ కోవర్టులమని ఆరోపణ చేయించారనేది సీనియర్ల ఆగ్రహం. తీన్మార్ మల్లన్న పోస్టులో ఉన్న నేతలంతా ఇప్పుడు మీటింగ్ కు హాజరవడం ఆసక్తికరం.
ఇక, సీనియర్ల ఆగ్రహానికి మరో కారణం.. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్. ఇటీవల కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయంపై సైబర్ క్రైమ్ పోలీసులు దాడి చేశారు. కంప్యూటర్లు, హార్డ్ డిస్క్ లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల దాడిని కాంగ్రెస్ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పలువురు సీనియర్ నేతలు గాంధీభవన్ దగ్గర నిరసన తెలిపారు. అనంతరం వారు సీపీ ఆనంద్ ను కలవగా.. ఆయన వారికో ఆసక్తికర విషయం చెప్పినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ నేతలు పోలీసులపై ఇంత రాద్దాంతం చేస్తున్నారు కానీ, మీకో సీక్రెట్ చెబుతానంటూ సీవీ ఆనంద్ సీనియర్లకు ఓ స్పైసీ న్యూస్ చెప్పారట. అదేంటంటే, సునీల్ కనుగోలు టీమ్.. టీఆర్ఎస్ బీజేపీతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులపై కూడా దుష్ప్రచారం జరిగే విధంగా పోస్టింగులు తయారు చేస్తున్నారని చెప్పారట. స్వయంగా పోలీస్ కమిషనరే ఆ విషయం చెప్పడంతో.. అది విన్న సీనియర్లు అవాక్కయ్యారట. కాంగ్రెస్ స్ట్రాటజీ టీమ్.. తమలాంటి సీనియర్లను కూడా టార్గెట్ చేస్తోందంటే.. ఇదంతా రేవంత్ రెడ్డినే చేయిస్తున్నారనేది వాళ్ల డౌట్.
ఇలా, తీన్మార్ మల్లన్న పోస్టు, సీపీ ఆనంద్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్.. కాంగ్రెస్ సీనియర్లను మరింత అసహనానికి, ఆగ్రహానికి గురి చేసిందని అంటున్నారు. అసలే కమిటీల్లో తమకు పలుకుబడి లేకుండా పోయిందనే అసంతృప్తి ఓవైపు వేధిస్తుంటే.. మల్లన్న పెట్టిన మంట, ఆనంద్ ఇచ్చిన షాక్ తో.. సీనియర్లు మరింత రెచ్చిపోయారని.. రేవంత్ విషయంలో తాడోపేడో తేల్చుకోవాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. మల్లన్నా.. ఎంతపని చేశావయ్యా. కాంగ్రెస్ లో చిచ్చుపెట్టావుకదయ్యా.