CM KCR: అట్టహాసంగా కొత్త సచివాలయంలో కొలువు దీరారు సీఎం కేసీఆర్. మొదటి రెండు రోజుల్లోనే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పోడుభూముల పంపిణీ, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల గైడ్లైన్స్.. ఇలా పలు ప్రాధాన్యమైన ఫైల్స్పై మొదటిరోజే సంతకాలు చేశారు. రెండోరోజే మే డే వచ్చింది. మళ్లీ గుడ్న్యూస్ చెప్పారు సీఎం. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు పెంచుతున్నట్టు ప్రకటించారు. ఆర్టీసీ కార్మికుల వేతనాలు కూడా పెంచాలని నిర్ణయించారు. మరోవైపు, హైదరాబాద్లో పేదల ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ గడువును మరోసారి పొడిగించారు. వ్యవసాయ భూముల నోటరీ సమస్యలను కూడా పరిష్కరిస్తామని చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపైనా సీఎం కేసీఆర్ సమీక్షించారు.
కొత్త సచివాలయం.. కొత్త నిర్ణయాలు.. ఏంటి సంగతి? అనే చర్చ నడుస్తోంది. వినిపిస్తున్న ఆన్సర్ ఒక్కటే. ఎలక్షన్ల కోసమే ఇదంతా చేస్తున్నారని అంటున్నారు. నాలుగున్నరేళ్లు పెండింగ్లో పెట్టి.. ప్రతీ బహిరంగ సభలో ఊదరగొట్టి.. ఊరించి.. తీరా ఎన్నికలకు గట్టిగా మరో నాలుగు నెలలు ఉందనగా వాటిలో కొన్నిటిని క్లియర్ చేసేస్తే సరిపోతుందా? జనం నమ్మేస్తారా? ప్రజలు కేసీఆర్కు మరీ అంత అమాయకులుగా కనిపిస్తున్నారా? అంటున్నాయి విపక్షాలు.
తొమ్మిదేళ్లుగా కేసీఆరే అధికారంలో ఉన్నారు. పోడుభూముల సమస్య దశాబ్దాలుగా ఉంది. మరి, ఇన్నాళ్లూ పట్టించుకోని ముఖ్యమంత్రి.. సరిగ్గా ఎన్నికల ముందు ఇప్పుడే పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటే ఇంకేం అనుకోవాలి? ఓట్ల కోసం కాకపోతే ఇంకేంటి? కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామన్న హామీ ఏనాటిది? అది కూడా ఇప్పుడే పరిష్కరించారంటే ఆ వర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నమేనా?
తెలంగాణ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టి రెడీగా ఉన్నాయి. కానీ, లబ్దిదారులకు మాత్రం ఆ ఇళ్లను అప్పగించలేదు. మంచిగా రంగులేసి, ముస్తాబు చేసి.. షో పీస్లా అలానే ఉంచేశారు. ఎందుకు? అంటే అధికారుల దగ్గర రీజన్ లేదు. అది, ఇందుకేనని ఇప్పుడు తెలుస్తోంది. కొత్త సచివాలయంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల గైడ్లైన్స్పై మంత్రి కేటీఆర్ తొలి సంతకం చేసి.. గొప్పగా చెప్పుకుంటున్నారు. ఎప్పుడో చేయాల్సిన పని ఇప్పుడు చేసి గొప్పలకు పోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇది పక్కా ఎలక్షన్ స్టంట్ అని దెప్పిపొడుస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో దళితబంధు పంపిణీ సైతం రానున్న ఎన్నికల కోసమేననే చర్చ నడుస్తోంది.
ఇలా కొత్త సెక్రటరియేట్లో.. కొత్త నిర్ణయాలు.. కేవలం పొలిటికల్ అడ్వాంటేజ్ కోసమేనా? మరి, పెండింగ్ హామీల సంగతేంటి? నిరుద్యోగ భృతి ఇంకెప్పుడు ఇస్తారు? ఉద్యోగ ఖాళీలను పూర్తిగా ఎప్పుడు భర్తీ చేస్తారు? ఇలా సోషల్ మీడియాలో కేసీఆర్కు అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు నెటిజన్లు.