ఇదీ కేటీఆర్ నోటి మాటలు. మొన్నటికి మొన్న అసెంబ్లీలో ద్రవ్యవినిమియ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ ఏకవచనంతో మాట్లాడారు. దీనిపై అధికార పక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో తన మాటలను వెనక్కు తీసుకుంటున్నట్లు చెప్పారు. నోరు జారనేల తిరిగి వెనక్కు తీసుకోవడమేల అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ప్రస్తుతం కేటీఆర్ ఎమ్మెల్యే మాత్రమే. సీఎం పదవికి గౌరవం ఇవ్వనంత అహంకారమా.. అంటూ కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు కూడా. ఏజ్లోనూ రేవంత్ కంటే 6 ఏళ్లు చిన్న కేటీఆర్.
కాబట్టి వయస్సుకైనా గౌరవం ఇవ్వాలి కదా.. అదీ జరగలేదు. నోరు ఉంది కదా అని మాట్లాడితే అది చివరికి నోరు జారిన వారి మెడకే చుట్టుకుంటుందన్నది చరిత్ర చెప్పిన నిజం. నేతల నోటి దురుసుతోనే ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఈ విషయం కేసీఆర్, కేటీఆర్ కు తెలియంది కాదు. అయినా అదే వైఖరి కంటిన్యూ చేస్తున్నారు. దీనిపై హస్తం నేతలైతే తీవ్రస్థాయిలో రియాక్ట్ అవుతున్నారు. బీఆర్ఎస్ నేతలు ఒళ్లు దగ్గరపెట్టుకోవాలంటూ కౌంటర్ ఇస్తున్నారు.
కేటీఆర్ తపన చూస్తే ప్రతి విషయంలోనూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనుకుంటున్నారు. సీన్ కట్ చేస్తే తిరిగి అందులో వారే ఇరుక్కుంటున్నారు. ఏమీ చేయలేకపోతున్నారు. ఇటీవలే సుంకిశాల దగ్గర రిటైనింగ్ వాల్ కూలింది. దీనిపై గట్టిగా మాట్లాడిన కేటీఆర్ చాలా ప్రశ్నలు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంధించారు. అందులో ఒక్కొక్కటి చూద్దాం. అసలు సుంకిశాల దగ్గర వాల్ ఆగస్ట్ 2న కూలితే సీఎంగానీ ఇతరులు గానీ వెంటనే ఎందుకు వెళ్లలేరని ప్రశ్నించారు. మరి గతేడాది అక్టోబర్ లో మేడిగడ్డ కుంగితే నాడు సీఎంగా ఉన్న కేసీఆర్ ఎందుకు వెళ్లలేదన్న ప్రశ్నలకు జవాబు లేదు.
అటు మేఘా కంపెనీ కాంట్రాక్టులపైనా కేటీఆర్ మాట్లాడుతున్నారు. వారు అధికారంలో ఉన్న గత పదేళ్లు అన్నీ కాంట్రాక్టులను టెండరింగ్ విధానం కాకుండా నామినేషన్ పద్ధతిలో కేటాయించి ప్రోత్సహించిన కేటీఆర్.. ఇప్పుడు సుంకిశాల కూలగానే.. మేఘాకు ఇచ్చిన కాంట్రాక్ట్ రద్దు చేసి బ్లాక్ లిస్టులో పెట్టాలంటున్నారు. ఇదే వెరైటీ. అక్కడితో ఆగలేదు.. సుంకిశాల సేఫ్టీ వాల్ కూలడం ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యమని, ప్రాజెక్టు నిర్మిస్తున్న ఏజెన్సీ మేఘా కంపెనీని వెంటనే బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు.
Also Read: రుణమాఫీ అమలు.. రాజీనామాపై హరీష్ రావు రియాక్షన్ ఇదే..
ప్రమాదానికి కారణమైన కాంట్రాక్ట్ ఏజెన్సీ మేఘా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్పై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో విపక్ష నేత రాహుల్గాంధీని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు కేటీఆర్. తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్ట్ సంస్థపై ఎందుకంత మెతక వైఖరితో ఉందో సమాధానం చెప్పాలని నిలదీశారు. మ్యాటర్ అక్కడితో ఆగలేదు. కాళేశ్వరం, విద్యుత్ అవకతవకలపై న్యాయ విచారణ చేయాలని గతంలో డిమాండ్ చేసినట్లుగానే ఇటీవలే సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలడం ఎవరి తప్పో తేల్చాలని ఎంక్వైరీ కమిషన్ వేయాలని కేటీఆర్ మరోసారి డిమాండ్ చేశారు.
వరద ప్రవాహాన్ని నిర్మాణ సంస్థ అంచనా వేయలేకపోయిందని ఒకరు.. నాణ్యత సరిగా లేదని ఇంకొకరు, గత ప్రభుత్వం డిజైన్లు, స్థలాలు మార్చారని మరొకరు, ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చూపడం వల్లే, ఆగమేఘాలపై కట్టడం వల్లే జరిగిందని.. ఇలా లెక్కలేనన్ని వాదోపవాదాలు నడుస్తున్నాయి. ఇందులో ఏది నిజం.. నిర్లక్ష్యం ఎవరిదో తేల్చేందుకు జలమండలితో ఎంక్వైరీ కమిటీ వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ రిపోర్ట్ వచ్చాక కాంట్రాక్ట్ సంస్థదే బాధ్యత అయితే చర్యలు తీసుకుంటామని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు కూడా.
కాబట్టి వరుసగా కౌంటర్లు పడుతున్నా కేటీఆర్ మాత్రం అదే స్టైల్ లో ముందుకెళ్తున్నారు. అవన్నీ రివర్స్ అవుతున్నాయన్న చర్చ సొంత పార్టీలోనే జరుగుతున్నా ఆయన దృష్టికి రావడం లేదా అన్నది కీలకంగా మారింది. ఒకప్పుడు ముద్దు అన్న కంపెనీ ఇప్పుడు అకస్మాత్తుగా వద్దు అనే దాకా ఎందుకు వెళ్లిందో చెప్పాలంటున్నారు. దగ్గరుండి కాంట్రాక్టులు కట్టబెట్టిన కంపెనీని పని మధ్యలో ఉండగానే, రిపోర్ట్ రాకముందే బ్లాక్ లిస్టులో పెట్టాలనడం ఏంటో అర్థం కాని విషయం. కాళేశ్వరం, విద్యుత్, సుంకిశాల పై న్యాయ విచారణ జరపాలని అనడం, తీరా కమిషన్లు ఏర్పాటు చేశాక విచారణకు సహకరించకపోవడం కూడా వారికే చెల్లిందని గుర్తు చేస్తున్నారు. అదీ కథ.