Hyderabad : భారతదేశ ప్రజాస్వామ్యంలో ఒక గొప్పతనం ఏమిటంటే, అది అవసరమైనప్పుడు ఎప్పటికప్పుడు బయటకు వస్తూనే ఉంటుంది. దేశ సేవకు నడుం బిగిస్తూనే ఉంటుంది. ఎన్నికల వేళ.. ప్రముఖ బైక్ ట్యాక్సీ సంస్థ ర్యాపిడో హైదరాబాద్ నగర వాసులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. నవంబర్ 30న అంటే ఎన్నికల రోజున నగరంలోని 2,600 పోలింగ్ బూత్ లకు ప్రజలను ఉచితంగా తీసుకువెళతానని ప్రకటించింది.
దీంతో నగరవాసులు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. అధికారులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఓటు వేయడానికి రండి, రండీ అని బతిమాలక్కర్లేదు. చక్కగా ర్యాపిడో బుక్ చేసుకువచ్చేయవచ్చు అంటున్నారు. చాలామంది పోలింగ్ బూత్ లకి వచ్చి బాధ్యతగా ఓటు వేస్తారుగానీ, కొంతమంది రావడానికి ఇష్టపడరు. దానికి రకరకాల కారణాలు చెబుతారు.
ఒకటి రాజకీయ నాయకులంటే ఇష్టం లేదంటారు. ఎవరికి ఓటు వేయడం ఇష్టం లేదంటారు. తీరిక లేదు.. ఎవరికేసినా ఒకటే కదా.. అంటారు. నా ఓటు దుర్వినియోగం చేయనని ఒకరంటారు. ఇలా ఏవేవో రకరకాల కారణాలు చెబుతుంటారు. ఇలాంటి వారి కోసమే నోటా ఓటు కూడా ఉంది. మీకు ఎన్నికలంటే ఇష్టం లేదని చెప్పడానికైనా పోలింగ్ బూత్ వరకు వెళ్లి, నోటా ఓటు వేస్తేనే కదా, అవతలి వారికి తెలిసేది. అంటున్నారు.
ఏదొకటి చేయాలి, మీ మనసులో మాటని ఓటుగా వేయాలని అంటున్నారు. లేదంటే 76 ఏళ్లుగా ఎన్నికలు ఇలాగే సాగుతున్నాయి. మరో 76 ఏళ్లు అలాగే ఉంటాయని అంటున్నారు. మీరు పోలింగ్ బూత్ కి వెళ్లడమన్నది భారతదేశ ప్రజాస్వామ్యానికి మంచిదని హితవు పలుకుతున్నారు.
అందుకే అలాంటివారి కోసం ర్యాపిడో సంస్థ ఎన్నికల ఒక్కరోజు అంటే నవంబర్ 30న పోలింగ్ బూత్ ల వద్దకు ప్రజలను ఉచితంగా తీసుకువెళ్లి వదిలిపెట్టనుంది. భారతదేశానికి ప్రజాస్వామ్యమే అతిపెద్ద ఆభరణం అని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించు కోవడంలో తమవంతు సహకారం అందిస్తామని ర్యాపిడో సంస్థ నిర్వాహకులు వివరించారు.
ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఓటు వేయడానికి వెళ్లేటప్పుడు ప్రజలకు ట్రాన్స్ పోర్టు అనేది, ఓ ప్రతిబంధకం కారాదన్నది తమ అభిమతమని తెలిపారు.
పోలింగ్ కేంద్రాలు ఎక్కడ పెట్టారు? ఎలా చేరుకోవాలి? అనే టెన్షన్ అవసరం లేదని అంటున్నారు. ర్యాపిడో బైక్ ల ద్వారా ఉచితంగా పోలింగ్ కేంద్రాలకు తీసుకువెళతామని చెబుతున్నారు.
మరింకెందుకండీ ఆలస్యం. చక్కగా రెడీ అయి, నీట్ గా టిప్ టాప్ గా ర్యాపిడో బైక్ ఎక్కి, పోలింగ్ కేంద్రం వద్ద దిగండి. లైనులో నిలబడి చక్కగా ఓటు వేసి వచ్చేయమని నెటిజన్లు చెబుతున్నారు.