Falaknuma express train fire accident news(Local news telangana) : ఫలక్నుమా రైలు అగ్ని ప్రమాదాన్ని తొలుత పసిగట్టి చైన్ లాగి వందల మంది ప్రాణాలు కాపాడిన రాజు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలోని లక్ష్మీనగర్లోని తన ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరూ లేని సమయంలో స్పృహతప్పి పడిపోయారు. తల్లి పార్వతి పలుమార్లు ఫోన్ చేసినా తీయలేదు. అనుమానంతో ఆమె ఇంటికి వచ్చి చూడగా కిందపడిపోయి కనిపించాడు. వెంటనే సూరారంలో మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ఛాతి నొప్పితోపాటు తలనొప్పి ఉందని ఆయన తల్లి పేర్కొన్నారు.
శ్రీకాకుళం జిల్లా పాత పట్టణం సమీపంలోని చిన్న మల్లెపురానికి చెందిన రాజు ఐడీఏ బొల్లారంలోని ఓ పరిశ్రమలో పనిచేస్తూ పదేళ్లుగా కుటుంబంతో ఇక్కడే నివసిస్తున్నాడు. ఇటీవల ఒడిశాలోని అమ్మమ్మ వాళ్ల ఊరికి వెళ్లి తిరుగు ప్రయాణంలో పలాసలో ఫలక్నుమా రైలెక్కాడు. భువనగిరి సమీపంలో రైలులో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదాన్ని పసిగట్టి చైన్లాగి 60 మంది ప్రయాణికులు సురక్షితంగా కిందకు దిగడానికి కారణమయ్యారు.
తోటి ప్రయాణికులను రక్షిస్తున్నప్పుడు మంటలద్వారా వచ్చిన పొగను సుమారు 45 నిమిషాలు పీల్చాడు. తరువాత ఆయన స్పృహతప్పి పడిపోగా రైల్వే సిబ్బంది భువనగిరి ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం అదేరోజు ఇంటికి చేరుకున్నాడు. తమ కుమారుడి అనారోగ్య సమస్యను గుర్తించి మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం సాయం చేయాలని ఆయన తల్లి కోరారు.